
విద్యార్థుల జీవితాలతో స్కూళ్లు చెలగాటమాడుతున్నాయి. స్కూల్ డే అంటూ వివిధ రకాల ఈవెంట్లను నిర్వహించే విద్యాసంస్థలు వారితో ఎలాంటి విన్యాసాలు చేయించాలో కూడా ఆలోచించడం లేదు. ఇలానే హైదరాబాద్ శివార్లలో ఉన్న కీసరలో ఓ స్కూల్ ప్రవర్తించింది. కీసర స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో జరిగిన ఘటన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. వార్షికోత్సవంలో జరిగిన అపశ్రుతితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిప్పుతో విన్యాసాలు చేసే ఓ వ్యక్తిని తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యం.. అదే సమయంలో స్కూల్ విద్యార్థులనూ అందులో పాల్గొనేలా చేసింది. విద్యార్థులతో ఫైర్ విన్యాసాలు చేసిన వ్యక్తి నిప్పుని తాను అంటించుకోవడమే కాకుండా.. విద్యార్థులపైనా నెట్టేయడంతో వారికీ మంటలు అంటుకున్నాయి. మిస్ ఫైర్ కావడంతో విద్యార్థులపై పడ్డ మంట అంటుకుని ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. గత నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా.. ఘటనను కప్పిబుచ్చే ప్రయత్నాలు చేసింది. విద్యార్థులపై నిప్పు పడే వీడియో వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. చిన్న పిల్లలతో ఫైర్ డాన్స్ పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్.
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు విద్యార్థికేమీ కాదని అన్నారని.. తర్వాతి రోజు సీరియస్ అవడంతో.. తామే ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు విద్యార్థి తండ్రి. ఫైర్ ప్రోగ్రామ్ ఉందని ముందే ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు తల్లిదండ్రులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి