CM KCR: హైదారాబాద్ చేరకున్న BRS అధినేత.. ఢిల్లీ టూర్ హైలెట్స్ మీ కోసం
బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఉదయం నుంచి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులను కలిసిన ఆయన.. హైదరాబాద్ చేరుకున్నారు. దేశ రాజధానిలో గులాబీజెండాను ఎగురవేసి, BRS విస్తరణకు బాటలు వేశారు గులాబీ బాస్.
ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అంతకు ముందు ఢిల్లీలో పలు సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.38 సమయంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో కూర్చుని తొలుత పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన్ను కలిసేందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సహా అమలు చేస్తున్న అన్ని వ్యవసాయ అనుకూల, రైతు అనుకూల విధానాల గురించి వారికి వివరించారు. రైతు సంఘాల నేతలతో చర్చ అనంతరం ఆయన మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్, పార్టీ జాతీయ నేతలకు కేటాయించిన చాంబర్లను కేసీఆర్ పరిశీలించారు. అదే సమయంలో పార్టీ నేతలకు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు.
కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు పోటీలు పడ్డాలు. అయితే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో తోపులాట కూడా చోటుచేసుకుంది. సకాలంలో భద్రతా సిబ్బంది కలుగజేసుకుని తోపులాటను నియంత్రించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అభిమానగణం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సమావేశాలు ముగించుకున్న కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం కోసం మహారాష్ట్రలోని తెలంగాణకు ఆనుకున్న ప్రాంతం విదర్భ నుంచి సామాన్య ప్రజానీకం తరలివచ్చారు. భారత రాష్ట్ర సమితిని జాతీయస్థాయిలో విస్తరించడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారని బీఆర్ఎస్ యువజన విభాగం నేత ప్రశాంత్ చౌదరి చెప్పారు. మొత్తంగా దేశంలో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, రాజకీయేతర వేదికలు కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. పార్టీ విస్తరణ కార్యాచరణ, వ్యూహాలు, ప్రణాళికల రచనలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం