Chicken Prices: నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. భానుడి భగభగలతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. ఓ వైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం కుదలవుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పత్తి భారీగా తగ్గడం.. ఖర్చులు పెరగడంతో చికెన్ ధరలు కొండెక్కాయి. కోడి మాంసం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో గత మూడు రోజులుగా లైవ్ కోడి ధర కిలో రూ.195కి చేరింది. మాంసం (స్కిన్తో) రూ.290కి, స్కిన్లెస్ రూ.320కి పెరిగింది. అయితే, ఏప్రిల్లో కిలో చికెన్ ధర రూ.150 మాత్రమే ఉండగా కేవలం రెండు నెలల్లోనే ధర రెట్టింపు అయింది. ఉత్పత్తి తగ్గడం.. డిమాండ్ బాగా పెరగడంతో ముక్క రేటు మరింత పెరిగినట్లు చికెన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు.
అయితే, సాధారణంగా ఓ కోడిపిల్ల దాదాపు కిలోన్నర ఎదగడానికి 40రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు ఎండల నేపథ్యంలో 45 నుంచి 60 రోజులు పడుతుందని.. అయితే, భారీ ఉష్ణోగ్రతల కారణంగా చాలా కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీల యజమానులు పేర్కొంటున్నారు. మరోవైపు దాణా రేట్లు పెరగడం కూడా ధరలపై చాలా ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
అయితే, చికెన్ ధరలు తగ్గడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు షాపుల యజమానులు. వాతావరణం చల్లబడేంత వరకు ఇదే పరిస్థితి నెలకొంటుందని పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..