Weather Alert: అబ్బబ్బ.. ఎండలు.. వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగి, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలతోపాటు.. వర్షాలు కూడా కురుస్తున్నాయి.. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్లో ఎండలు దండి కొడుతుండగా.. తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి కొమరెన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాహత ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు:
ఈరోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఏపీలో ఎండలు.. వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
