కామారెడ్డిలో ఘోర విషాదం.. RB నగర్లో కన్నబిడ్డలను కడతేర్చిన తండ్రి
కన్నతండ్రే కాలయముడు అయ్యాడు.. కంటికి రెప్పలా కాపాడాల్సివాడే కర్కశంగా వ్యవహరించాడు.. కన్నబిడ్డల ప్రాణాలు తీసేశాడు.. అన్యాయంగా చెరువులో తోసేసి బలి తీసుకున్నాడు.. కట్టుకున్న భార్య ముందు.. పోలీసుల ఎదుట ఏం తెలియనట్లు కథలు వల్లించాడు.. కానీ.. పోలీసుల రివర్స్ ఎటాక్తో నిజం కక్కేశాడు.. ఏం చెప్తే ఏం లాభం.. చేయాల్సింది చేశాడు... జరగాల్సిన ఘోరం.. జరిగిపోయింది.. కామారెడ్డిలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. పెను విషాదాన్ని నింపింది.. కన్నతండ్రే ముగ్గురు చిన్నారులను కడతేర్చడం కన్నీళ్లు పెట్టిస్తోంది.

కాలయముడు.. కర్కశుడు…. ఇలా ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే.. అసలు పేరు ఇస్మాయిల్.. కనీసం పేరుకు తగ్గట్టుగా ఇసుమంతైనా ప్రేమ, దయ, కరుణ అనేయే లేనివాడు.. కామారెడ్డి ఐదుగురు చిన్నారుల అదృశ్యం కేసులో ముగ్గురు చెరువులో శవాలై తేలడం తీవ్ర విషాదాన్ని నింపింది. కామారెడ్డి ఆర్బీనగర్కు చెందిన ఈ ముగ్గురు చిన్నారులను కన్న తండ్రే హత్య చేయడం సంచలనం సృష్టించింది. కన్నతండ్రి అని చెప్పడానికి కూడా మనసు రాని పరిస్థితి.. అవును.. శనివారం ఉదయం ముగ్గుర్నీ తన ఆటోలో తీసుకెళ్లిన ఇస్మాయిల్.. మనసులను మెలిపెట్టే అత్యంత దారుణానికి ఒడికట్టారు. అభంశుభం తెలియని అమాయకులను చెరువులో తోసివేసి ప్రాణాలు తీసేశాడు. ఆపై.. ఏమీ తెలియనట్లు పిల్లల కనిపించడం లేదని తన భార్యకు ఫోన్ చేసి చెప్పడం షాకిచ్చింది. ఇరువురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు. అయితే.. ఆటోలో పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడ వదిలిపెట్టావని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పాడు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో కిరాతకాన్ని కక్కేశాడు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల్ని పోషించలేకే చంపేసినట్లు చెప్పడం మరింత కలచివేస్తోంది. ఇక.. ముగ్గురు పిల్లల్ని పొట్టనబెట్టుకున్న రాక్షసుడ్ని చంపేయాల్సిందే అంటోంది అతని భార్య షబీనా. కఠినంగా శిక్షించాలంటూ కన్నీటి పర్యంతం అవుతోంది.
3 రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ
ఇదిలావుంటే… కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. మూడు రోజులు గడుస్తున్నా.. ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు చిన్నారుల మృతి నేపథ్యంలో మరింత టెన్షన్ పడుతున్నారు. ఇద్దరు చిన్నారులు జాడ తెలియకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
