Telangana: మంత్రి కొండా సురేఖకు హైకమాండ్ బిగ్ షాక్.. సాయంత్రం వరకే డెడ్లైన్
మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. సాయంత్రంలోపు రాజీనామా చేయాలిన ఆదేశించింది. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ససేమీరా అంటే బర్తరఫ్ చేస్తూ గవర్నర్కు లేఖ పంపుతామన్న హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించని విధంగా బిగ్ షాక్ ఇచ్చింది. గురువారం సాయంత్రంలోపు మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆమెకు హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అధిష్ఠానం ఆదేశాలను కాదని సురేఖ రాజీనామా చేసేందుకు ససేమీరా అంటే.. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్కు లేఖ పంపుతామని హైకమాండ్ స్పష్టం చేసింది.
ఢిల్లీలో వేగంగా మారిన రాజకీయ పరిణామాలు
పరకాల సీటు విషయంలో కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. మెజార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొండా సురేఖను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం ఇదే విషయాన్ని హైకమాండ్కు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ పెద్దలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం.
సురేఖ నిర్ణయంపై ఉత్కంఠ
హైకమాండ్ జారీ చేసిన డెడ్లైన్ నేపథ్యంలో కొండా సురేఖ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఆదేశాలకు తలొగ్గి ఆమె రాజీనామా లేఖను సమర్పిస్తారా? లేక తన రాజకీయ బలాన్ని చాటుకుంటూ అధిష్ఠానం నిర్ణయాన్ని ఎదిరిస్తారా? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
