Munugode Bypoll: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి TRS బీ ఫామ్.. రూ.40 లక్షల చెక్ అందజేసిన CM KCR….
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. పార్టీ బీ ఫామ్ ను అందజేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. పార్టీ బీ ఫామ్ ను అందజేశారు. అభ్యర్థి ప్రకటన అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీఫాంను అందచేసారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ నిధినుంచి రూ.40 లక్షల చెక్కును అందచేశారు. తనకు అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు సీఎం కెసిఆర్ కు కూసుకుంట్ల ఈ సందర్భంగా కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సూచనలు సైతం చేశారు. పార్టీ గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలు, పలు అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నల్గగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తదితరులున్నారు.
బీజేపీకి డిపాజిట్లు కూడా రావు.. కూసుకుంట్ల..
మునుగోడు టికెట్ ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నాని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనకు టికెట్ ఇచ్చినందుకు మునుగోడు ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ తనపై నమ్మకంతో నాలుగోసారి బీఫామ్ ఇచ్చారన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ కు రుణపడి ఉన్నానని.. తల్లిదండ్రులు తనకు జన్మణిస్తే…కేసీఆర్ నాకు రాజకీయ జన్మను ఇచ్చారు. బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు రావని.. టీఆరెస్ జెండా గెలుస్తుందని కూసుకుంట్ల తెలిపారు. రాజగోపాల్ నమ్ముకున్న ప్రజలను అమ్ముకొని పోయారంటూ విమర్శించారు. మునుగొడును అనాధగా చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయారన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉందని.. మరి నిధులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పి ఆనాడు గెలిచారని.. ఈ ముడున్నర ఏండ్లలో ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సీటును 22వేల కోట్లకు అమ్ముకున్నాడని విమర్శించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ ను నమ్మేందుకు సిద్ధంగా లేరని.. బీజేపీ పార్టీ ముడోస్థానంలో ఉందని పేర్కొన్నారు.
కాగా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ప్రకటన అనంతరం.. మంత్రి కేటీఆర్ పలువురు నేతలతో భేటీ అయ్యారు. కూసుకుంటతో సహా.. మంత్రి జగదీశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరైనా సహకరించాలని నేతలకు కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కసుకుంట్ల పేరు ప్రకటించడానికి ముందు పార్టీ పలు కోణాల్లో సర్వేలు చేయించింది. అన్నింటిలోనూ కూసకుంట్లకే మొగ్గు చూపడంతో పార్టీ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలువాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్.. బలమైన అభ్యర్థిని ఎంపిక చేశారు. త్వరలోనే నామినేషన్ తేదీని కూడా ఖరారు చేయనున్నారు.
తొలిరోజు రెండు నామినేషన్లు..
మునుగోడులో నామినేషన్ల సందడి షురూ అయింది. నవంబర్ 3న జరిగే పోలింగ్కు మొదటి దశ పక్రియ ప్రారంభమైంది. నామినేషన్లకు చివరితేదీ ఈనెల 14. శుక్రవారం మునుగోడు ఉప ఎన్నికకు తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొదటిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజాఏక్త పార్టీ అభ్యర్ధి బండారు నాగరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి మారం వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే నామినేషన్ల దాఖలు.. మధ్యాహ్నం మూడు గంటలతో ముగుస్తుందని అధికారులు తెలిపారు.
కేటీఆర్, హరీష్ రావు వ్యూహంతో..
నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నెల 10న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 14న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ మొత్తం యంత్రాంగాన్ని మోహరించింది. మంత్రులకు, పలు కీలక నేతలకు మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మొత్తం బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చూసుకోనున్నారు. ఇప్పటికే.. సీపీఐ, సీపీఎంలు సైతం టీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో.. ఆ పార్టీలను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకుసాగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
