
మొన్న ఖమ్మంలో.. ఇవాళ మక్తల్లో..! పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజల్ని కూడా నమ్ముకుంటున్నారు కొందరు. ప్రత్యర్థులు ఓడిపోవాలంటూ.. ఓం భీమ్ బుష్ అంటూ.. ఏవేవో పూజలు చేస్తున్నారు. రేపు తుది విడత ఎన్నికలు అనగా మక్తల్ సమీపంలో జరిగిన ఘటన పెద్ద కలకలాన్నే రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ వేళ క్షుద్ర పూజల కలకలం రేగింది. బీజేపీ బలపరచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు అర్థరాత్రి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. తెల్ల ఆవాలు, పసుపు, ఇంకా మరికొన్ని రకాల వస్తువులు ఏవో చల్లి పూజలు చేశారంటోంది వెంకటమ్మ కుటుంబం. ఉదయాన్నే ఇంటిముందు ఇలాంటి దృశ్యం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలతో కీడు తప్పదనే భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అయితే అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇదంతా కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి బంధువులపనే అంటున్నారు వెంకటమ్మ. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇదంతా కాంగ్రెస్ మద్దతుదారు రేణుక మామ అయిన రాములు చేసినట్టుగా నిర్థారణకు వచ్చారు. ఆయన కూడా దీన్ని ఒప్పుకున్నాడని చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఇదే రకంగా రాములు పూజలు చేశాడని చెప్తున్నారు. ఎలక్షన్ టైమ్లో ఈ క్షుద్రపూజల ఎపిసోడ్ ఊళ్లో పెద్ద టెన్షన్ వాతావరణాన్నే సృష్టించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..