Bharat Bandh: ప్రయాణికులకు అలర్ట్.. రేపు యధాతథంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు..
Bharat Bandh - TS RTC: దేశవ్యాప్తంగా సోమవారం రైతుసంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

Bharat Bandh – TS RTC: దేశవ్యాప్తంగా సోమవారం రైతుసంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. రేపు జరిగే భారత్ బంద్ కు తెలంగాణ ఆర్టీసీ దూరంగా ఉండనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో రేపు బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సర్వీసులను కూడా నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రజలు ప్రతి రోజులాగే తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి బస్సు సర్వీసులు నడవబోవని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ బంద్లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడపమని.. ఆ తర్వాత నుండి బస్సులు యధావిధిగా తిరుగుతాయని.. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. పలు రైతు సంఘాలు, వామ పక్షాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ భారత్ బంద్ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని వామపక్షాలు మద్దతు పలకగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భారత్ బంద్ కు పలు కార్మిక సంఘాలతోపాటు బ్యాంకు, తదితర రంగాల సంస్థలు కూడా మద్దతు తెలిపాయి.