నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స.. దక్షిణ భారతంలోనే హైదరాబాద్లో తొలిసారిగా ..
ఏఐజీ హాస్పిటల్స్ హైదరాబాద్, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ZAP-X గైరోస్కోపిక్ న్యూరో-రేడియో సర్జరీ ప్లాట్ఫారమ్ను ప్రవేశపెట్టింది. మెదడు కణితులకు ఇది కోత లేకుండా, రక్తస్రావం లేకుండా, కేవలం కొన్ని నిమిషాల్లోనే అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స అందిస్తుంది. రోగులు అదే రోజు ఇంటికి వెళ్లవచ్చు. అనస్థీషియా అవసరం లేదు. మెదడు వ్యాధుల చికిత్సలో ఇది ఒక విప్లవాత్మక అడుగు, రోగులకు పెద్ద ఉపశమనం.

వైద్య రంగంలో మరో అద్భుతం.మెదడు సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడే రోగులకు హమ్మయ్య అనుకునే వార్త. అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ZAP-X గైరోస్కోపిక్ న్యూరో-రేడియో సర్జరీ ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.మెదడు గడ్డలకు చికిత్స అంటే ఒకప్పుడు గంటల తరబడి చేసే పెద్ద సర్జరీ.. కానీ ఇప్పుడు ZAP-Xతో కేవలం కొన్ని నిమిషాల్లోనే, అది కూడా ఎటువంటి కోత లేకుండా చికిత్స పూర్తి చేయవచ్చు.
ఈ పద్ధతిలో స్కాల్పెల్ లేదా సర్జరీ కత్తుల అవసరం ఉండదు. కేవలం రేడియేషన్ కిరణాల ద్వారానే ట్యూమర్ను నిర్మిలిస్తారు.రోగి ఆసుపత్రిలో రోజుల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. చికిత్స చేయించుకుని అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు.మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఎటువంటి నష్టం కలగకుండా, కేవలం ట్యూమర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ మిషన్ పనిచేస్తుంది.ఆపరేషన్ అంటే భయపడే వారికి ఇది వరం లాంటి వార్త. ఎటువంటి అనస్థీషియా అవసరం లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈ టెక్నాలజీతో కేవలం బ్రెయిన్ ట్యూమర్లు మాత్రమే కాకుండా మరికొన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపవచ్చు అని AIG న్యూరో సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుబోధ్ రాజు తెలిపారు.సాధారణంగా మెదడు శస్త్రచికిత్స అంటే రోగులు ఎంతో ఆందోళన చెందుతారు. కానీ ZAP-X టెక్నాలజీతో కోత లేకుండా, రక్తస్రావం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో చికిత్స అందించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి, చైర్మన్, ఏఐజీ హాస్పిటల్స్ తెలిపారు. రేడియో సర్జరీ విభాగంలో ZAP-X ఒక తర్వాతి తరం విప్లవమని కొనియాడారు.హైదరాబాద్ గ్లోబల్ మెడికల్ హబ్గా ఎదుగుతున్న తరుణంలో, AIG హాస్పిటల్స్ తీసుకొచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ దక్షిణ భారత్లో మెదడు వ్యాధుల చికిత్సలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




