Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త. ఈ సారి ముందుగానే..
తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త అందించారు. వచ్చే రబీ సీజన్కు యూరియా కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తెలంగాణకు కేటాయించిన యూరియా త్వరగా రాష్ట్రానికి చేరుకునేలా కేంద్రానికి లేఖ కూడా రాశారు. గతంలో యూరియా కొరత ఏర్పడిన క్రమంలో చర్యలు చేపట్టారు.

తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపికబురు అందించారు. యూరియా కొరత లేకుండా సరిపోయేంతగా ముందస్తుగా సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు యూరియా నిల్వలను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, త్వరలోనే రాష్ట్రానికి యూరియా స్టాక్ భారీగా చేరుతుందన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రబీ సీజన్ మొదలు కానుంది. దీంతో ఈ సీజన్లో యూరియా కొరత లేకుండా చేసేందుకు ఇప్పటినుంచే చర్యలు చేడుతున్నట్లు తెలిపారు. గతంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడిన క్రమంలో ఈ సారి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం నిల్వలను పెంచుతోంది.
అందుబాటులో 2.48 లక్షల మెట్రిక్ టన్నులు
ప్రస్తుతం తెలంగాణలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇక డిసెంబర్ చివరి నాటికి ఈ నిల్వలను మరింత పెంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ వరకు అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ నెలకు కేటాయించిన 86 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తూత్తుకుడి, గంగవరం, కారైకల్, జైగఢ్, వివిధ ఓడరేవులకు చేరుకుందన్నారు. వీటిని త్వరగా తెలంగాణకు తరలించేలా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు లేఖలు రాశామన్నారు.
అధికారులకు ఆదేశాలు
త్వరతగతిన యూరియా రాష్ట్రానికి తీసుకొచ్చేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరియా రవాణాకు అవసరమైన ఖాళీ రైల్వే రేక్లను వెంటనే కేటాయించాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్షవ్ను కోరారు. పోర్టులలో క్లియరెన్స్, హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని, ఇతర వస్తువుల కంటే యూరియా రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. రవాణాలో జాప్యాన్ని నివారించడానికి పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రవాణా ప్రక్రియను పర్యవేక్షించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులను కూడా ఓడరేవులకు పంపసినట్లు స్పష్టం చేశారు.




