Telangana: పొట్ట ఉబ్బిపోయి నొప్పితో కనిపించిన ఆవు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా
సాధారణంగా ఆవులు గడ్డితోపాటు ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటాయి. అవి జీర్ణమై పేడ రూపంలో బయటికి వస్తుంది. అయితే అనారోగ్యానికి గురైన ఆవుకు పశువైద్యులు చికిత్స చేశారు. అయినా కోల్పోకపోవడంతో పశు వైద్యులు.. ఆవుకు ఆపరేషన్ చేశారు. ఆవు కడుపులో ఉన్న వాటిని చూసి షాక్ తిన్నారు. పశువైద్యలు ఎందుకు షాక్ తిన్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రామలింగం అనే రైతు పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. 9 ఏళ్ల ఆవు కొద్ది రోజులుగా నీరసంగా ఉంటూ అనారోగ్యానికి గురైంది. ఆ ఆవు అప్పటికే ఐదు నెలల సుడితో ఉండటం, కడుపు భారీగా వాపు ఉండటంతో రైతు రామలింగం ఆందోళన చెందాడు. రామలింగం తన ఆవును స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాలకు తీసుకువచ్చారు. పశువైద్యాధికారి పెంటయ్య ఆవును పరీక్షించి.. కడుపులో భారీమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయని గుర్తించాడు. అత్యవసరంగా ఆపరేషన్ చేయకపోతే ఆవు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. సుడి కావడంతో ఆపరేషన్ చేస్తే చనిపోతుందని రైతు రామలింగం ఆందోళన చెందాడు. అయినా తన సిబ్బందితో పశు వైద్యాధికారి పెంటయ్య నాలుగు గంటల పైగా శ్రమించి ఆపరేషన్ చేశాడు. ఆవుకు ఆపరేషన్ చేసిన వైద్యులు మాత్రం షాక్ తిన్నారు.
ఆవు కడుపులో జీర్ణం కాని వ్యర్ధాలను భారీ మొత్తంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, కేబుల్ వైర్లు, తాళ్ళు, ఇంకా రకరకాల తీగలు, మామిడి టెంకలు, ఇనుప తీగలు, జాలీలు, గుడ్డ పేలికలు ఇలా రకరకాల వస్తువులు ఈ వ్యర్ధాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఆవులు గడ్డి, పచ్చిమేత దొరకకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్ధాలను తింటున్నాయని, ఏళ్ల తరబడి తినడంతో కడుపులో జీర్ణం కాక మిగిలిపోయాయని పశు వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా స్వచ్చంద సంస్థలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి.. తీసుకువస్తే రోడ్లపై తిరిగే ఆవుల కడుపులోని వ్యర్ధాలను ఆపరేషన్ చేసి తొలగిస్తామని పశువైద్యాధికారి పెంటయ్య చెబుతున్నారు.




