AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాల్లో కూర్చుని మీ నంబర్‌తోనే కోట్లు నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు..

మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డుపై వేరే వాళ్లు సిమ్ కార్డులు వాడుతున్నారా? దుబాయ్, కంబోడియా లాంటి దేశాల్లో కూర్చుని సైబర్ నేరగాళ్లు మీ పేరు మీదున్న నంబర్లతోనే కోట్లాది రూపాయల స్కామ్‌లు చేస్తున్నారా? వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 లో ఈ నకిలీ సిమ్ కార్డుల ముఠా గుట్టు రట్టయింది.

విదేశాల్లో కూర్చుని మీ నంబర్‌తోనే కోట్లు నొక్కేస్తున్నారు.. హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు..
How Cyber Criminals Are Using Fake Sims Abroad
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: May 29, 2026 | 9:18 PM

Share

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల్లో అక్రమంగా పొందిన సిమ్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో అరెస్టయిన 66 మంది నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన దాదాపు 5 వేల సిమ్ కార్డులు సైబర్ మోసగాళ్ల చేతికి చేరి, వాటి ద్వారా వివిధ యాప్‌లు, మెసేజింగ్ సేవలకు అక్రమంగా యాక్సెస్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది మధ్యవర్తులు అమాయకుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకుని వాటి నియంత్రణను సైబర్ మోసగాళ్లకు అప్పగించారు. కొన్ని సందర్భాల్లో ఈ సిమ్ కార్డులు నేరుగా విదేశాల్లోని సైబర్ డెన్లకు చేరగా, మరికొన్ని సందర్భాల్లో సిమ్‌లకు సంబంధించిన ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు సేకరించి వాటి ఆధారంగా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ఖాతాలను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల పాత్ర కూడా కీలకమని అధికారులు చెబుతున్నారు.

తమ ఆధార్ నంబర్‌పై ఎన్ని మొబైల్ కనెక్షన్లు నమోదయ్యాయో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంచార్ సాథి వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను వినియోగించాలని సూచించారు.సంచార్ సాథి ద్వారా అనుమానాస్పద కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ సందేశాలపై ఫిర్యాదు చేయడంతో పాటు నకిలీ కేవైసీ ఆధారంగా తీసుకున్న మొబైల్ కనెక్షన్లను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అలాగే తమ ఆధార్‌పై నమోదైన మొబైల్ నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ అసలుదా కాదా అనేది కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ధృవీకరించుకోవచ్చు.

పోలీసుల దర్యాప్తులో దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏజెంట్లు సిమ్ కార్డులను సేకరించి విదేశాలకు పంపుతున్న నెట్‌వర్క్ ఉన్నట్లు బయటపడింది. ముఖ్యంగా కంబోడియా, దుబాయ్ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ మోసగాళ్లు భారతీయుల పేర్లపై తీసుకున్న సిమ్ కార్డులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొన్నిసార్లు మోసం విదేశాల నుంచి జరిగినప్పటికీ, ఉపయోగించిన నంబర్లు భారతీయుల పేర్లలో ఉండటంతో దర్యాప్తు క్లిష్టంగా మారుతోందని అధికారులు తెలిపారు. సైబర్ మోసాలకు బలికాకుండా ఉండాలంటే తమ పేరుపై నమోదైన మొబైల్ కనెక్షన్లను తరచుగా పరిశీలించడం, అనుమానాస్పద నంబర్లను వెంటనే రిపోర్ట్ చేయడం, తెలియని వ్యక్తులకు సిమ్ కార్డులు లేదా వ్యక్తిగత వివరాలు ఇవ్వకపోవడం అత్యంత అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us