Smartphone addiction: స్మార్ట్ ఫోన్ మత్తులో భారతీయులు.. రోజుకు ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా..?
ఆధునిక మానవ జీవితంలో స్మార్ట్ ఫోన్ అత్యంత అవసరమైన వస్తువుగా మారింది. ఇది లేకపోతే ఒక్క రోజు కూడా ముందుకు నడవని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారాలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ, దాన్ని ఎక్కువగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి.

ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం.. భారతీయులు రోజుకు సగటున ఐదు గంటల సమయంలో ఫోన్ లో గడుపుతున్నారు. వీరందరూ సోషల్ మీడియాను ఫాలో కావడం, గేమింగ్ ఆడడం, వీడియోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. మన దేశంలో 1.2 బిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వారిలో 950 మిలియన్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభించడం, చౌకైన ఇంటర్నెట్ ప్యాక్ ల కారణంగా ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ఈ మార్పు దేశాన్ని డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయించింది. ఇదే సమయంలో ఎక్కువ మంది ఫోన్ కు బానిసలుగా మారారని ఇటీవల విడుదలైన నివేదికలో వెల్లడైంది. ఆన్ లైన్ లో గంటల తరబడి సమయాన్ని గడుపుతున్నట్టు తెలిపింది. దేశంలోని మీడియా, వినోద పరిశ్రమలో డిజిటల్ ప్లాట్ ఫాంల వాటా విపరీతంగా పెరిగింది. టెలివిజన్ వాటాను అధిగమించి ముందుకు దూసుకుపోయింది. దీని విలువ 2024లో రూ.2.5 ట్రిలియన్లు ఉందని అంచనా. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ లతో భారతీయులు అధిక సమయం గడుపుతున్నారు.
స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ సమయంలో గడిపే వారిలో ఇండోనేషియా ప్రజలు ముందున్నారు. తర్వాత బ్రెజిల్ కొనసాగుతోంది. అయితే భారతదేశం త్వరలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ గా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెటా, అమెజాన్ వంటి దిగ్గర సంస్థలు మన దేశంలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటల్ మార్కెట్ లో ఆధిపత్యం కోసం ముఖేష్ అంబానీ, ఎలోన్ మస్క్ వంటి బిలియనీర్ల మధ్య పోటీ నెలకొంది.
డిజిటల్ మార్కెట్ రోజు రోజుకూ విస్తరించుకుంటూ పోతుంటే, దానికి భిన్నంగా సంప్రదాయ మీడియా,టెలివిజన్, ప్రింట్, రేడియో రంగాలు వెనకడుగు వేస్తున్నాయి. ఆదాయం, మార్కెట్ పరంగా క్షీణతను చూస్తున్నాయి. షార్ట్ ఫామ్ వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్, ఇంటరాక్టివ్ గేమింగ్ కు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వాటిని చూడటానికి ఎక్కువ సమయం గడుపుతున్నారు. డిజిటల్ మీడియా శరవేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో మీడియా కూడా ముందుకు వెళుతుందని భావిస్తున్నారు. మీడియా కంపెనీల మధ్య ఏకీకరణ, వినూత్న వ్యాపార నమూనాలు, భాగస్వామ్యాలు ఉంటాయని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి