India Vs Australia 2020: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. చివరి టెస్టుకు విహారి దూరం..!
India Vs Australia 2020: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్లు గాయాల కారణంగా..
India Vs Australia 2020: టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా సిడ్నీ టెస్టు(Sydney Test) హీరో హనుమ విహారి సైతం ఆ జాబితాలోకి చేరాడు. పిక్క గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విహారి ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు అతడు అందుబాటులో ఉండదు. అటు స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్కు కూడా విహారి ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బొటన వేలు గాయం కారణంగా జడేజా(Ravindra Jadeja) చివరి టెస్టుకు దూరమైనా సంగతి తెలిసిందే.
కాగా, సిడ్నీ టెస్టులో రవీంద్ర జడేజా కీలక వికెట్లు పడగొట్టి తన పాత్రను పోషించగా… గాయం బాధిస్తున్నా.. నొప్పిని భరిస్తూ చివరి రోజు విహారి ఆడిన తీరు ప్రశంసనీయం. డ్రాగా ముగించేందుకు అతడు స్పూర్తిదాయక పోరాటం చేశాడు. అశ్విన్తో కలిసి దాదాపు 50 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి టీమిండియాను ఓటమి అంచుల నుంచి కాపాడాడు. విహారి(Hanuma Vihari) అనుసరించిన వ్యూహానికి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.