West Indies vs Bangladesh: కరేబియన్ క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) అదరగొట్టాడు. పవర్ఫుల్ హిట్టింగ్తో బంగ్లా పులులపై విరుచుకుపడ్డాడు. గయానా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించాడు పూరన్. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. పూరన్ మెరుపు ఇన్నింగ్స్తో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మొదటి టీ20లో ఫలితం రాలేదు. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో గెలుపొందిన పూరన్ బృందం మూడో టీ20 మ్యాచ్లోనూ ఏకపక్ష విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ లిట్టన్ దాస్ (49), అఫిఫ్ హొస్సెయిన్ (50) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కరేబియన్ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి టార్గెట్ను అందుకుంది. లక్ష్య ఛేదనలో 43 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన విండీస్ను కైల్ మేయర్స్ (55), కెప్టెన్ పూరన్ ఆదుకున్నారు. ముఖ్యంగా నికోలస్ ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మేయర్స్తో కలిపి నాలుగో వికెట్ కు 85 పరుగులు జోడించిన కెప్టెన్ ఆ తర్వాత రోవ్మన్ పావెల్తో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. తుదివరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. కాగా మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పూరన్కే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు లభించాయి.