AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఏక్ బిహారీ సబ్ పే భారీ.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న విరాట్ కోహ్లీ పవర్‌ఫుల్ డైలాగ్

Virat Kohli : గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయ్యింది. అందులో కింగ్ విరాట్ కోహ్లీ ఈ 15 ఏళ్ల కుర్రాడిని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. వీరిద్దరూ అంత సీరియస్‌గా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు, ఊహాగానాలు సాగాయి.

Virat Kohli : ఏక్ బిహారీ సబ్ పే భారీ.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న విరాట్ కోహ్లీ పవర్‌ఫుల్ డైలాగ్
Virat Vibhav
Rakesh
|

Updated on: Jun 03, 2026 | 4:15 PM

Share

Virat Kohli : నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు. ఆయనే 15 ఏళ్ల బీహార్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ వండర్ కిడ్ ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి వీఐపీ స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు.

వైరల్ వీడియో గుట్టు విప్పిన ఆర్సీబీ

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయ్యింది. అందులో కింగ్ విరాట్ కోహ్లీ ఈ 15 ఏళ్ల కుర్రాడిని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. వీరిద్దరూ అంత సీరియస్‌గా ఏం మాట్లాడుకున్నారనే దానిపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు, ఊహాగానాలు సాగాయి. ఈ ఉత్కంఠకు తెర దించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పూర్తి వీడియోను షేర్ చేసింది. ఇందులో కోహ్లీ ఆ కుర్రాడికి ఇచ్చిన అద్భుతమైన సలహా అందరినీ ఆకట్టుకుంటోంది.

కోహ్లీ ఇచ్చిన పవర్‌ఫుల్ సలహా ఇదే

వైభవ్ సూర్యవంశీ భుజంపై చేయి వేసి విరాట్ కోహ్లీ హిందీలో మోటివేట్ చేశాడు. “నువ్వు ఇక్కడి నుంచి ఇంకా పైకి ఎదగాలి. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. బయట ఎవరు ఏం మాట్లాడినా అస్సలు వినొద్దు. మైదానంలో కేవలం నువ్వు, నీ బ్యాట్ మాత్రమే ఉండాలి. ఒక బీహారీ అందరి కంటే గొప్ప (ఏక్ బిహారీ సబ్ పే భారీ).. అంతే గేమ్ ఖతమ్” అంటూ కోహ్లీ ఆ చిన్నారి క్రికెటర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. భారత క్రికెట్‌లో దూకుడును నేర్పిన విరాట్, భయం లేకుండా బ్యాటింగ్ చేసే వైభవ్‌కు ఇచ్చిన ఈ సలహా నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.

ఐపీఎల్ 2026ను శాసించిన సూర్యవంశీ

ఈ ఐపీఎల్ సీజన్ విజేతగా ఆర్‌సీబీ నిలిచినప్పటికీ, 2026 సీజన్ మాత్రం వైభవ్ సూర్యవంశీ పేరుతోనే గుర్తుండిపోతుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లీగ్‌లో సునామీ సృష్టించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 16 ఇన్నింగ్స్‌లు ఆడి 776 పరుగులు సాధించి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాకుండా ఫైనల్ ముగిసిన తర్వాత మరో నాలుగు అవార్డులను కూడా కైవసం చేసుకుని, మొత్తం రూ.55 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

టీమిండియా ఎంట్రీకి రంగం సిద్ధం?

ఈ అద్భుత ప్రదర్శన తర్వాత వైభవ్ సూర్యవంశీ అతి త్వరలోనే భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ చివరి వారంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ త్వరలోనే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించనుంది. ఈ జట్టులో వైభవ్‌కు చోటు ఖాయమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ అడుగుపెడితే.. కేవలం 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

రాత్రికి రాత్రే పెరిగిన మార్కెట్ వాల్యూ

ఐపీఎల్ 2026లో చూపించిన విశ్వరూపంతో వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల్లోనే అతని కమర్షియల్ యాడ్స్ రేట్లు డబుల్ అయ్యాయి. గతంలో ఒక బ్రాండ్ ప్రకటన కోసం దాదాపు కోటి రూపాయలు తీసుకునే ఈ వండర్ కిడ్, ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్‌లతోనే తన మార్కెట్ రేంజ్‌ను 100 శాతం పెంచుకుని సీనియర్ ప్లేయర్లకు సైతం వైభవ్ గట్టి పోటీ ఇస్తున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us