వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. కీలక టోర్నమెంట్కు బుడ్డోడు రెడీ.. కెప్టెన్గా ఎవరో తెలిస్తే షాకే..?
Vaibhav Sooryavanshi East Zone Vice Captain: 15 ఏళ్ల వయసులోనే వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తున్న వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీలో ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల కలయికతో ఈస్ట్ జోన్ జట్టు టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.

Vaibhav Sooryavanshi East Zone Vice Captain: భారత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ కోసం ఈస్ట్ జోన్ (తూర్పు మండలం) బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనుండగా.. ఇటీవల జింబాబ్వే టూర్లో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అనూహ్యంగా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ ప్రకటించిన జట్టులో అందరి దృష్టి బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ వైపే నిలిచింది. కేవలం 15 ఏళ్లకే దేశవాళీలో వైస్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం ఒక అరుదైన మైలురాయి. ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఇటీవల తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఆశించిన మేర రాణించకపోయినా, జింబాబ్వేపై తన విశ్వరూపం చూపించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో కేవలం 49 బంతుల్లోనే 81 పరుగులు బాది, తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్లో మొత్తం 151 పరుగులు రాబట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం 8 మ్యాచ్లు మాత్రమే ఆడినా, అతని అటాకింగ్ స్టైల్ చూసి సెలెక్టర్లు అతనిపై ఎంతో నమ్మకం ఉంచారు.
కెప్టెన్గా ఇషాన్ కిషన్ ఎంట్రీ..
ఈస్ట్ జోన్ జట్టు పగ్గాలను భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చేతికి అప్పగించారు. టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడైన ఇషాన్, ఇటీవల జింబాబ్వేతో జరిగిన వైట్ బాల్ సిరీస్లో అద్భుతమైన ఫామ్ను కనబరిచాడు. ఓపెనర్గా బరిలోకి దిగి భారత జట్టుకు అదిరిపోయే ఆరంభాలు అందించాడు. అతని కెప్టెన్సీ అనుభవం, ఫామ్ పరిగణనలోకి తీసుకుని ఈస్ట్ జోన్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. టెస్ట్ జట్టులోకి మళ్లీ పునరాగమనం చేయాలని ఆరాటపడుతున్న కిషన్కు ఈ దులీప్ ట్రోఫీ ఒక మంచి వేదిక కానుంది.
షమీ రీఎంట్రీ.. జట్టు బలం డబుల్..
ఈస్ట్ జోన్ బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్కు దూరమైన షమీ, ఈ టోర్నీ ద్వారా తిరిగి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. షమీతో పాటు మరో భారత పేసర్ ముఖేష్ కుమార్, స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం ఈస్ట్ జోన్కు అదనపు బలం.
ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ సమరం..
ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా వివిధ మైదానాల్లో దులీప్ ట్రోఫీ 2026 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు జోన్ల జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. గత సీజన్ (2025)లో రజత్ పాటిదార్ నాయకత్వంలోని సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న సెంట్రల్ జోన్కు, ఈ పటిష్టమైన ఈస్ట్ జోన్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈస్ట్ జోన్ జట్టు (East Zone Squad):
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, డెనిష్ దాస్, అభిజిత్ సర్కార్.
స్టాండ్బై ఆటగాళ్లు:
ఆయుష్ లోహరుక, శ్రీదామ్ పాల్, సంబిత్ ఎస్. బరాల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమాల్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




