AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో హింట్ ఇచ్చిన వైభవ్.. ‘ఆ ఎమోజీ’ వెనుక అసలు కథ ఇదేనా!

Vaibhav Sooryavanshi : ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఏకంగా 776 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ ఆశించారు.

Vaibhav Sooryavanshi : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో హింట్ ఇచ్చిన వైభవ్.. 'ఆ ఎమోజీ' వెనుక అసలు కథ ఇదేనా!
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jul 01, 2026 | 7:24 AM

Share

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో బుధవారం (జూలై 1, 2026) ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌తో ఒక సరికొత్త రికార్డు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చేస్టర్-లే-స్ట్రీట్ మైదానం నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే, కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో బ్లూ జెర్సీ ధరించిన ప్లేయర్‌గా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఈ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

నిజానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ఏకంగా 776 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది. ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ, అక్కడ జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లలోనూ మేనేజ్‌మెంట్ అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. దురదృష్టవశాత్తూ టీమిండియా ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దాంతో ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు. వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదంటూ, ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా అతడిని మొదటి మ్యాచ్ నుంచే ఆడించాలని డిమాండ్లు గట్టిగా వినిపించాయి.

మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే మంగళవారం (జూన్ 30) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వైభవ్ డెబ్యూ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, అయ్యర్ ఇచ్చిన సమాధానాలు చూస్తే వైభవ్ మరికొంత కాలం వేచి చూడక తప్పదనే సంకేతాలు కనిపించాయి. శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోచ్, కెప్టెన్, మేనేజ్‌మెంట్ యంగ్ టాలెంటును తొక్కేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఎవరు తుది జట్టులో ఉంటారో ప్రకటించే అలవాటు భారత క్రికెట్‌లో చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి, కెప్టెన్ అయ్యర్ కూడా విషయాన్ని రహస్యంగా ఉంచి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రేయస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అభిమానుల్లో కాస్త నిరాశ ఆవహించినప్పటికీ, మంగళవారం రాత్రి వైభవ్ సూర్యవంశీ స్వయంగా చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మళ్లీ అందరిలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇంగ్లాండ్ టూర్‌లో దిగిన కొన్ని అద్భుతమైన ఫోటోలను వైభవ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలకు క్యాప్షన్‌గా గ్రేట్‌ఫుల్ అని రాస్తూ, పక్కన ఒక ఇసుక గడియారం ఎమోజీని ఉంచాడు. సోషల్ మీడియా భాషలో ఈ ఎమోజీకి మయం ఆసన్నమైంది లేదా పెద్ద మార్పు కోసం వేచి చూడండి అనే అర్థం వస్తుంది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందే వైభవ్ ఈ రేంజ్‌లో హింట్ ఇవ్వడంతో, అతను రేపటి మ్యాచ్‌లో ఖచ్చితంగా బరిలోకి దిగుతున్నాడని, తన డెబ్యూ మ్యాచ్‌పై అతనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేసే సమయంలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us