IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..?
India vs Zimbabwe 3rd T20I Predicted Playing 11: మొత్తంగా రెండు లేదా మూడు మార్పులతో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరి పోరులో భారత్ బరిలోకి దిగనుంది. ప్రయోగాలు చేస్తూనే 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి విజయవంతంగా పర్యటనను ముగించాలని యువ టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

India vs Zimbabwe 3rd T20I Predicted Playing 11: జింబాబ్వేపై వరుస విజయాలతో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా ఈరోజు జరగబోయే ఆఖరి టి20 మ్యాచ్లోనూ విజయం సాధించి వైట్వాష్ చేయాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెంట్లో రెండు లేదా మూడు కీలక మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
శ్రేయస్ అయ్యర్ మార్క్ లీడర్షిప్..
హరారే వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ చెలరేగిపోయిన టీమిండియా యువ సేన, ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ అద్భుత విజయంతో మూడు మ్యాచ్ల పొట్టి ఫార్మాట్ సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు, జింబాబ్వే పర్యటనలో మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. రెండో మ్యాచ్ ముగిసిన 24 గంటల వ్యవధిలోనే మూడో టీ20 జరగనుండటంతో, అదే ఊపును కొనసాగించి జింబాబ్వేను వారి సొంతగడ్డపైనే క్లీన్ స్వీప్ చేయాలని భారత మేనేజ్మెంట్ పట్టుదలతో ఉంది.
ప్రిన్స్ యాదవ్కు గాయం: బలవంతపు మార్పు తప్పదా?
మూడో టీ20 మ్యాచ్ కోసం భారత తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రెండో మ్యాచ్లో అద్భుతమైన స్పెల్తో రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసిన యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. హ్యామ్స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో అతను బౌలింగ్ మధ్యలోనే అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
ఈ గాయం కారణంగా ప్రిన్స్ యాదవ్ ఈరోజు జరిగే ఆఖరి మ్యాచ్కు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. అతని స్థానంలో తుది జట్టులోకి మరొక ఫాస్ట్ బౌలర్ను తీసుకోవడం అనివార్యమైంది.
ప్రభ్సిమ్రాన్ సింగ్ అరంగేట్రం? బెంచ్ బల నిరూపణకు ఛాన్స్!
ఇప్పటికే సిరీస్ భారత్ వశమవ్వడంతో, ఇప్పటివరకు అవకాశాలు రాని బెంచ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు జట్టు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ స్థానంలో హర్ష దూబేకు తుది జట్టులో అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయి.
మరోవైపు ఓపెనింగ్ ఆర్డర్లోనూ అనూహ్య మార్పు జరిగే అవకాశం ఉంది. ధనాధన్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయించే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే వైభవ్ సూర్యవంశీ లేదా అభిషేక్ శర్మలలో ఒకరికి విశ్రాంతి నివ్వవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ రెండో టీ20లో బౌలింగ్లో 3 వికెట్లు తీసినప్పటికీ, వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్లో విఫలమైనందున అతనికి రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
