AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..

Ind vs Eng T20 Series Clean Sweep: వరుస సిరీస్ పరాజయాలు, టీ20 నంబర్ వన్ ర్యాంకును కోల్పోవడం అయ్యర్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ. వరల్డ్ ఛాంపియన్ హోదాలో ఉన్న జట్టు ఇలా వరుసగా క్లీన్‌స్వీప్‌లు కావడంపై మేనేజ్‌మెంట్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే సిరీస్‌లలో బౌలింగ్ లోపాలను సవరించుకుని జట్టు పటిష్టంగా పునరాగమనం చేస్తుందో లేదో చూడాలి.

బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్..
Ind Vs Eng 5th T20i Result
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 6:55 AM

Share

Ind vs Eng T20 Series Clean Sweep: సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ విధించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ రికార్డు సృష్టించింది. ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.

ప్రపంచ నంబర్ వన్ పీఠాన్ని కోల్పోయిన భారత్..

ఈ చారిత్రాత్మక విజయంతో ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియాను వెనక్కి నెట్టి అధికారికంగా ప్రపంచ నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌కు గురవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన జట్టు.. ఇప్పుడు నాసిరకమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఉగాండా జట్టులా ఆడుతోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బట్లర్, బ్రూక్ సిక్సర్ల సునామీ..

ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రత్యర్థిని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే ఫిల్ సాల్ట్‌ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేసి భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత రెండో వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ జోడీ నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో బట్లర్ 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131 పరుగులు చేయగా, హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చేతులెత్తేసిన మిడిలార్డర్.. తప్పని ఓటమి..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఈ మ్యాచ్‌లో సూర్యవంశీని పక్కనపెట్టి సంజూ శాంసన్‌కు చోటు కల్పించింది. కానీ సంజూ 27 పరుగులకే పెవిలియన్ చేరగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 28 పరుగులకే పరిమితమయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు అర్ధశతకాలు సాధించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా, మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 201 పరుగులకే పరిమితమై 56 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us