AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC vs BCB: ఆడాలా, వద్దా.. ఐసీసీ గడువుతో టెన్షన్‌లో బంగ్లాదేశ్.. ఏకంగా ఆటగాళ్లతో ఏం ప్లాన్ చేసిందంటే?

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌ నేడు చావో రేవో తేల్చుకోనుంది. టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలా లేదా అనేది మరికొద్దిసేపట్లో తేలనుంది. ఈ కీలక నిర్ణయం తీసుకునే ముందు, ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆటగాళ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత కీలక ప్రకటన రానుంది.

ICC vs BCB: ఆడాలా, వద్దా.. ఐసీసీ గడువుతో టెన్షన్‌లో బంగ్లాదేశ్.. ఏకంగా ఆటగాళ్లతో ఏం ప్లాన్ చేసిందంటే?
Icc Vs Bcb
Venkata Chari
|

Updated on: Jan 22, 2026 | 11:14 AM

Share

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. అయితే, ఐసీసీ, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న సందిగ్ధం మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ వివాదానికి నేడు తేలనుంది. బంగ్లాదేశ్ క్రికెట్‌ భవిష్యత్తు కూడా ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ప్రభుత్వం తమ జట్టును టీ20 ప్రపంచ కప్‌లో ఆడేందుకు భారతదేశానికి పంపాలా వద్దా అని తేల్చుకునే పడిలో పడ్డాయి. బంగ్లాదేశ్ మొండి వైఖరితో ఉంటే, టీ20 ప్రపంచ కప్ నుంచి మినహాయించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలలో ఏది అమలవుతుందో నేటితో తెలవనుంది. అయితే, ఆ నిర్ణయం ముందు బంగ్లాదేశ్‌లో కొంత గందరగోళం నెలకొంది. ఐసీసీతో సమావేశమై 24 గంటల అల్టిమేటం జారీ చేసిన తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా క్రికెటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ప్లేయర్లతో ప్రభుత్వం కీలక సమావేశం..

బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, ఢాకాలోని హోటల్ కాంటినెంటల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంతో 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఆటగాళ్లతో సమావేశం దేనికి..?

2026 టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన క్రికెటర్లతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎందుకు సమావేశాన్ని షెడ్యూల్ చేసింది? ఈ విషయంపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రభుత్వం వినాలనుకోవడం ఒక కారణం కావొచ్చని అంతా భావిస్తున్నారు. అలాగే, ఇదే సమావేశంలో ప్రభుత్వం తన అభిప్రాయాలను, ఆలోచనలను ఆటగాళ్లతో పంచుకోనుంది. మొత్తంమీద, బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో హోటల్ కాంటినెంటల్‌లో జరగనున్న ఈ సమావేశం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఉందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆటగాళ్లతో ఈ సమావేశానికి ముందు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లు జనవరి 21 రాత్రి బంగ్లాదేశ్ ప్రభుత్వం నియమించిన క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో కూడా సమావేశమయ్యారని కూడా సమాచారం. ఈ సమావేశం సలహాదారుడి ఇంట్లో జరిగింది. మొత్తంమీద, ఐసీసీ చివరి 24 గంటల అల్టిమేటం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టించింది.

అంతకుముందు, వేదికను మార్చాలనే బంగ్లాదేశ్ డిమాండ్‌పై ఐసీసీ ఓటింగ్ నిర్వహించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2-14 తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసింది. మిగిలిన జట్ల బోర్డులు భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. ఆ తర్వాతే ఐసీసీ బంగ్లాదేశ్‌కు 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమిస్తే, స్కాట్లాండ్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..