AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RCB : రూ.వెయ్యి టికెట్ ఏకంగా 20 వేలు.. ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. కోహ్లీ కోసమేనా ?

SRH vs RCB : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రూ.వెయ్యి టికెట్లను దళారులు రూ. 20 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.అలాగే రూ.7,000 విలువ చేసే ప్రీమియం టికెట్లను దళారులు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు అమ్ముతున్నారు.

SRH vs RCB : రూ.వెయ్యి టికెట్ ఏకంగా 20 వేలు.. ఉప్పల్‌లో బ్లాక్ టికెట్ల దందా.. కోహ్లీ కోసమేనా ?
Srh Vs Rcb
Rakesh
|

Updated on: May 22, 2026 | 10:25 AM

Share

SRH vs RCB : భాగ్యనగరంలో ఐపీఎల్ 2026 ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే ఆఖరి మ్యాచ్ కావడంతో క్రీడాభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను లైవ్‌గా వీక్షించేందుకు జనాలు ఎగబడుతున్నారు. కస్టమర్ల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకున్న కేటుగాళ్లు నకిలీ యాప్‌లతో, బ్లాక్ టికెట్లతో ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారు. స్టేడియం చుట్టుపక్కల దళారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

ఈ మ్యాచ్‌కు ఇంత భారీ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం కింగ్ విరాట్ కోహ్లీ. కోహ్లీని మైదానంలో దగ్గరగా చూడాలనే కోరికతో యువతీ యువకులు ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు. అసలు ధర కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ పెట్టి మరీ టికెట్లు కొంటున్నారు. సాధారణంగా రూ.1,000 విలువైన ఒక టికెట్‌ను ఒక వీరాభిమాని ఏకంగా రూ.20 వేలు పెట్టి బ్లాక్‌లో కొనుగోలు చేయడం ఇక్కడి క్రేజ్‌కు అద్దం పడుతోంది. అలాగే రూ.7,000 విలువ చేసే ప్రీమియం టికెట్లను దళారులు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు అమ్ముతున్నారు.

స్టేడియం లోపల విఐపి బాక్స్‌లో కూర్చుని మ్యాచ్ చూసేలా కార్పొరేట్ బాక్స్ టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లయిన ఒక జంట.. విలాసవంతంగా మ్యాచ్ ఆస్వాదించాలని భావించి, నకిలీ ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ.లక్ష చెల్లించి మోసపోయినట్లు తెలుస్తోంది. గురువారం స్టేడియం పరిసరాల్లో ఏజెంట్లు బాహాటంగా బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్‌గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు నిఘా పెట్టి, 10 మంది అనుమానిత దళారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు పందెపు రాయుళ్ల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా కూడా హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ నెట్‌వర్క్ సిద్ధం చేసింది. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌పైనే నగరంలో దాదాపు రూ.20 కోట్ల మేర బెట్టింగులు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ పోలీస్ అధికారి అంచనా వేశారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సూత్రధారులు ఇక్కడి లోకల్ ఏజెంట్లకు ప్రత్యేక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా సీక్రెట్ ఐడీలను కేటాయిస్తున్నారు. నగదు లావాదేవీలు పోలీసుల కంటికి చిక్కకుండా ఉండేందుకు ఇతరుల పేర్లపై ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలను వాడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తున్న బుకీల ఆట కట్టించడానికి టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. నగరంలోని ప్రధాన హోటళ్లు, పబ్‌లు, అనుమానిత ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు. నకిలీ వెబ్‌సైట్లు, అనధికారిక లింకుల ద్వారా టికెట్లు కొని మోసపోవద్దని, సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడొద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), పోలీసులు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us