Team India: మీ కళ్లు దోబ్బాయా.. ఈ ప్లేయర్ను అసలెందుకు ఛీ కొడుతున్నారు..!
Sourav Ganguly Key Comments on Mohammed Shami: టీమిండియా మాజీ ప్లేయర్ సౌరవ్ గంగూలీ బీసీసీకి కీలక సూచనలు చేశాడు. అద్భుతంగా ఆడుతున్న ఓ ప్లేయర్ను పక్కన పెట్టడంపై వాపోయారు. దేశవాళీలోనే కాదు, ఐపీఎల్లోనూ సత్తా చాటుతోన్న ఈ ప్లేయర్ను వెంటనే భారత జట్టులో చేర్చాలని కోరాడు.

Team India: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓ ప్లేయర్ ను భారత క్రికెట్ జట్టులో చేర్చాలని బలంగా కోరుకుంటున్నాడు. ఐపీఎల్లో అతని అద్భుతమైన ప్రదర్శనే ఇందుకు నిదర్శనమంటూ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లకు పెను ముప్పు కలిగిస్తాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఫిట్నెస్, ప్రస్తుత ఫామ్ను చూస్తే వెంటనే జాతీయ జట్టులో చేర్చాలని అభిప్రాయపడ్డాడు. మంగళవారం బెంగాల్ ప్రో టీ20 లీగ్ మూడవ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ షమీపై ప్రశంసలు కురిపించాడు. షమీ ఇటీవలి కాలంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని, ఇప్పుడు భారత జట్టులో తిరిగి రావాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశాడు.
ఏప్రిల్ 9న కోల్కతాలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2026 కీలక పోరు జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో మహమ్మద్ షమీపై అందరి దృష్టి ఉండనుంది.
సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే..?
షమీ ఫిట్నెస్, ప్రదర్శనను గురించి మాట్లాడుతూ రీఎంట్రీ ఇచ్చి జస్ప్రీత్ బుమ్రాతో కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గంగూలీ మాట్లాడుతూ, “షమీ అద్భుతమైన బౌలర్. మనమందరం చూశాం, గత రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్కు వ్యతిరేకంగా అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదీ టీ20లో ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను సైలెంట్ చేయడం మాములు విషయం కాదు. ఇది నిజంగా అద్భుతం” అని తెలిపాడు.
భారత జట్టు తరపున ఆడాలని కోరుకుంటున్నాను: గంగూలీ
సౌరవ్ గంగూలీ మహమ్మద్ షమీ రంజీ ట్రోఫీలో ఆడాలనే నిర్ణయాన్ని సమర్థించాడు. “అతను క్రీడను కొనసాగించడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఫాస్ట్ బౌలర్కు ఇది చాలా కష్టమైన పని. కానీ, అతన్ని కొత్త బంతితో బౌలింగ్ చేయడం చూడడం అద్భుతంగా ఉంది” అని తెలిపాడు.
“షమీ చాలా ఫిట్గా ఉన్నాడు. అతను నెలల తరబడి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా అతను తన అత్యుత్తమ ఫామ్కు చేరుకున్నాడు. ఇప్పుడు ఎవరూ అతనితో పోటీపడలేరు. నేను అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, త్వరలో అతన్ని మళ్లీ భారత జట్టు కోసం ఆడటం చూడాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
మహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలి..
మహమ్మద్ షమీ క్రికెట్ కెరీర్ను గురించి మాట్లాడితే, అతను భారత్ కోసం చివరి టీ20 మ్యాచ్ ఇంగ్లండ్తో వాంఖడేలో ఫిబ్రవరి 2, 2025న ఆడిన సంగతి తెలిసిందే. అయితే వన్డే మ్యాచ్ న్యూజిలాండ్తో మార్చి 9, 2025న చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను భారత జట్టు నుంచి దూరంగా ఉన్నాడు.
అయినప్పటికీ, అతను దేశీయ క్రికెట్లో నిరంతరం చురుకుగా ఉంటున్నాడు. ఐపీఎల్ 2026లో షమీ అద్భుతమైన ప్రదర్శనను బట్టి భారత్కు మరోసారి తిరిగి రావచ్చని భావిస్తున్నారు. ఎంపిక కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్, సెలెక్టర్లు షమీ ప్రదర్శనను నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే సిరీస్ల కోసం అతనికి అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
