ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డులో పంజాబ్ నయా కింగ్..!
పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక పోరులో కేవలం 24 బంతుల్లోనే అర్థశతకం బాది, పవర్ ప్లేలో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ వైభవ్ సూర్యవంశీ ఉన్న ఎలైట్ క్లబ్లో చేరిపోయాడు.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా పంజాబ్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే, ప్రియాన్ష్ ఆర్య రూపంలో తన నిర్ణయం ఎంత తప్పో అతనికి వెంటనే అర్థమైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన ఆర్య, తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం ఆరు ఓవర్ల లోపే ఢిల్లీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు.
చరిత్ర పుటల్లోకి యువ కిశోరం..
ఈ మెరుపు ఇన్నింగ్స్తో ప్రియాన్ష్ ఆర్య ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే (తొలి 6 ఓవర్లు) ముగియకముందే అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 4 సార్లు ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉండగా, ప్రియాన్ష్ 3 సార్లతో రెండో స్థానంలో నిలిచాడు.
తొలి బంతికే సిక్సర్: జైస్వాల్తో పోటీ..
మ్యాచ్ ఆరంభమైన మొదటి బంతికే సిక్సర్ కొట్టడం ప్రియాన్ష్కు ఇది కొత్తేమీ కాదు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో తొలి బంతిని స్టాండ్స్కు పంపిన ఆర్య, ఇప్పుడు స్టార్క్ బౌలింగ్లోనూ అదే పునరావృతం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధికంగా 4 సార్లు సిక్సర్లు బాదిన రికార్డు యశస్వి జైస్వాల్ పేరిట ఉండగా, ప్రియాన్ష్ ఆర్య ఇప్పటికే 3 సార్లు ఈ ఫీట్ సాధించి అతనికి చేరువయ్యాడు.
పంజాబ్ కింగ్స్ విజయకేతనం..
గత సీజన్లో పంజాబ్ జట్టు ఫైనల్ వరకు వెళ్లడంలో ప్రియాన్ష్ ఆర్య కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది కూడా ప్రభ్సిమ్రాన్ సింగ్తో కలిసి అతను అందిస్తున్న ఆరంభాలు జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేరుస్తున్నాయి. కేవలం వేగంగా ఆడటమే కాకుండా, నిలకడగా పరుగులు సాధిస్తూ పంజాబ్ కింగ్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ నిజం చేస్తున్నాడు.
