
IPL 2027: ప్రపంచ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా తనదైన శైలిలో అభిమానులను అలరించడం ‘తలా’ ప్రత్యేకత. తాజాగా ఒక ప్రచార కార్యక్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమాని అడిగిన వింత ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో ఒక ఆర్సీబీ అభిమాని ధోనీ ముందుకు వచ్చి.. “వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2027 సీజన్ విజేత ఎవరో చెప్పండి? కానీ ఒక చిన్న కండిషన్.. విజేతలను అంచనా వేసేటప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టును మాత్రం ఆ జాబితా నుంచి పక్కన పెట్టేయండి” అని కోరాడు.
ఈ వింత కోరిక వినగానే ధోనీ ముఖంలో చిరునవ్వు చిందించింది. ఏమాత్రం తడుముకోకుండా తనదైన శైలిలో స్పందిస్తూ.. “నేను ఇలాంటి ప్రశ్నలకు అస్సలు సమాధానం చెప్పను. ఎవరికి నచ్చిన జట్టుకు వారు మద్దతు ఇచ్చే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది” అంటూ నవ్వుతూ దాటవేశారు. అంతేకాదు, “సరే ఇంతకీ నువ్వు ఏ జట్టు అభిమానివి?” అని ధోనీ ఎదురు ప్రశ్నించగా.. సదరు అభిమాని ఏమాత్రం భయపడకుండా, అందరి ముందు గట్టిగా తానే ఒక ఆర్సీబీ అభిమానినని గర్వంగా చెప్పుకున్నాడు. సీఎస్కేకు పరమ శత్రువుగా భావించే ఆర్సీబీపై ఆ యువకుడు చూపించిన అభిమానాన్ని చూసి ధోనీ సైతం మురిసిపోయారు.
ఐపీఎల్ 2026 సీజన్లో ఇరు జట్ల ప్రదర్శనలు పూర్తిగా భిన్నంగా సాగాయి. రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. తద్వారా 2025 నాటి తమ విజయాన్ని విజయవంతంగా కాపాడుకుని.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీలు సాధించిన చెన్నై, ముంబై సరసన మూడో జట్టుగా నిలిచింది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కథ మాత్రం పూర్తి నిరాశాజనకంగా సాగింది. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆ జట్టు వరుసగా మూడోసారి కూడా ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. గతేడాది కేవలం ఆరు విజయాలు, ఎనిమిది ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
MS Dhoni 🗣️Zhoorrr Seee Bolooo
Student 🗣️ RCBbbbbbbbbbbbbb🗿❤️ pic.twitter.com/yBDeJBBjTz— Sandeep Yadav (@Kohliitak) June 29, 2026
క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపరుస్తూ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా కేవలం బెంచ్కే పరిమితమయ్యారు. ఐపీఎల్ చరిత్రలో ఆయన ఇలా పూర్తిగా మైదానానికి దూరం కావడం ఇదే తొలిసారి. సీజన్ ప్రారంభానికి ముందే పిక్క గాయం (Calf Injury) కారణంగా మొదటి రెండు వారాలు ఆటకు దూరమైన ధోనీ, ఆ తర్వాత నెట్స్లో సాధన చేసినప్పటికీ.. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ముందుజాగ్రత్తగా బరిలోకి దిగలేదు.
ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
అయితే వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి ధోనీ మళ్లీ సీఎస్కే తరపున మైదానంలోకి వస్తారని మేనేజ్మెంట్ భావిస్తోంది. వచ్చే వారమే ఆయన 45వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, వచ్చే సీజన్ నాటికి ఆయన వయసు 46 ఏళ్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 సీజన్ ఆయన కెరీర్లో చివరిది అయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయిలో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..