Duleep Trophy Final: తిలక్ వర్మ నిర్ణయం తప్పేనా?.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో పక్కనబెడితే.. సెంచరీతో కౌంటర్ ఇచ్చిన స్టార్ బ్యాటర్
Duleep Trophy Final: గత రంజీ సీజన్లో కర్ణాటక తరఫున 699 పరుగులు సాధించి సత్తా చాటిన కరుణ్ నాయర్ను సెమీఫైనల్తో పాటు ఫైనల్ మ్యాచ్కు కూడా సెలక్ట్ చేయకపోవడం గమనార్హం. జట్టు కలయిక, వ్యూహాల కారణంతోనే అతడిని పక్కనబెట్టినట్లు సౌత్ జోన్ కోచ్ విక్రమ్ వర్మ తెలిపారు.

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ను పక్కనబెట్టిన సౌత్ జోన్ మేనేజ్మెంట్ నిర్ణయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో చోటు లభించకపోవడంతో బెంగళూరుకు చేరుకున్న కరుణ్, అక్కడ కేఎస్సీఏ టోర్నీలో మైండ్ బ్లాకింగ్ సెంచరీ బాది తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఈషాన్ కిషన్ 270 పరుగుల భారీ ఇన్నింగ్స్తో విరుచుకుపడి, సౌత్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగుల కొండంత స్కోరు సాధించింది. సౌత్ జోన్ బౌలర్లు, ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. అదే సమయంలో తుది జట్టులో అవకాశం దక్కక బెంగళూరుకు వెళ్లిన కరుణ్ నాయర్, డాక్టర్ థిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో ఛత్తీస్గఢ్పై కేఎస్సీఏ సెక్రటరీ ఎలెవెన్ తరఫున 183 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 104 పరుగులు సాధించి అద్భుత శతకంతో చెలరేగాడు.
పక్కనబెట్టడం వెనుక అసలు కథ ఏమిటి?
గత రంజీ సీజన్లో కర్ణాటక తరఫున 699 పరుగులు సాధించి సత్తా చాటిన కరుణ్ నాయర్ను సెమీఫైనల్తో పాటు ఫైనల్ మ్యాచ్కు కూడా సెలక్ట్ చేయకపోవడం గమనార్హం. జట్టు కలయిక, వ్యూహాల కారణంతోనే అతడిని పక్కనబెట్టినట్లు సౌత్ జోన్ కోచ్ విక్రమ్ వర్మ తెలిపారు. ప్రతి జట్టులో ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఉన్నందున, మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను ఉంచడం వల్ల ఒత్తిడి పెంచవచ్చని భావించినట్లు చెప్పారు. దేవదత్ పడిక్కల్ జట్టులోకి రావడం, లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కుదరడంతో కరుణ్ నాయర్ లాంటి సీనియర్ ఆటగాడిని పక్కనబెట్టడం తప్పలేదని వివరణ ఇచ్చారు.
వ్యక్తిగత కారణాలంటూ సాకులు చెప్పారా?
ఆదివారం సాయంత్రం బెంగళూరుకు బయలుదేరిన కరుణ్ నాయర్, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత కారణాల వల్ల పయనం అవుతున్నట్లు సౌత్ జోన్ మేనేజ్మెంట్కు ఈమెయిల్ పంపాడు. కోచ్ వర్మ కూడా ఇదే విషయాన్ని మీడియాకు స్పష్టం చేశారు. స్వస్థలానికి చేరుకున్న వెంటనే స్థానిక టోర్నీలో పాల్గొని సెంచరీ సాధించడంతో, జట్టు యాజమాన్యం చెప్పిన వ్యక్తిగత కారణాలు కేవలం తుది జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సౌత్ జోన్ మూల్యం చెల్లించుకోక తప్పదా?
ఫ్లాట్ పిచ్పై ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించిన వేళ కరుణ్ నాయర్ జట్టులో ఉండి ఉంటే బ్యాటింగ్ లైనప్కు కొండంత బలం చేకూరేది. తిలక్ వర్మ బృందం తీసుకున్న ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ఎంతటి ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
