Video: పేరులో పొరపాటు.. కట్చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయించిన ఛోటా ప్యాకెట్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఇషాన్ కిషన్ 79 పరుగులతో సింహస్వప్నంలా విరుచుకుపడ్డాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్లో ఈ స్టార్ బ్యాటర్కు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అవార్డు ప్రకటన సమయంలో జరిగిన ఒక చిన్న గందరగోళం వల్ల సహచర ఆటగాళ్లు నవ్వులు ఆపుకోలేక కిందపడి దొర్లగా, కిషన్ ముఖం చాటేయాల్సి వచ్చింది.

హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో మే 22న జరిగిన లీగ్ చివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు చెలరేగిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్లతో పాటు ఇషాన్ కిషన్ కేవలం 46 బంతుల్లోనే 79 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు (RCB) ముందు భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు 200 పరుగులకే పరిమితం కావడంతో, హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి లీగ్ దశను విజయంతో ముగించింది.
డ్రెస్సింగ్ రూమ్లో అసలు కథ.. కిషన్ అనుకున్నదొక్కటి, అయినదొక్కటి..!
మ్యాచ్ ముగిసిన అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్లో ఆనాటి మ్యాచ్ అత్యుత్తమ ప్రదర్శనకారుడికి ఇచ్చే అవార్డు వేడుక జరిగింది. తాను ఆడిన మెరుపు ఇన్నింగ్స్కుగానూ ఆ అవార్డు తనకే దక్కుతుందని ఇషాన్ కిషన్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కోచింగ్ సిబ్బందిలో ఒకరు విజేత పేరును ప్రకటిస్తూ ‘ఇషాన్…’ అని పిలవగానే, కిషన్ ఎంతో గర్వంగా, నమ్మకంతో సీట్లోంచి లేచి నిలబడ్డాడు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది.
కోచింగ్ స్టాఫ్ పిలిచింది ఇషాన్ కిషన్ను కాదు, జట్టులోని మరో ఆటగాడు ‘ఈషాన్ మలింగ’ను. ఇద్దరి పేర్ల ఉచ్చారణ ఒకేలా ఉండటంతో కిషన్ పొరబడ్డాడు. అసలు విషయం అర్థం కావడంతో ఇషాన్ కిషన్ సిగ్గుతో ముఖం దాచుకుంటూ మళ్లీ సీట్లో కూలబడ్డాడు. అతని ముఖకవళికలు చూసిన డ్రెస్సింగ్ రూమ్లోని మిగతా ఆటగాళ్లు, సిబ్బంది ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వుతూ సందడి చేశారు.
ఈషాన్ మలింగకు అవార్డు ఎందుకు దక్కిందంటే?
Oh my Kishanu😂😭🤣 https://t.co/6F1MKTiczB pic.twitter.com/S4OC24yhj7
— SunrisersVicky (@VickySunrisers) May 23, 2026
ఇషాన్ కిషన్ బ్యాట్తో అద్భుతం చేసినప్పటికీ, బౌలింగ్లో ఈషాన్ మలింగ కీలకమైన పాత్ర పోషించాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ మ్యాచ్లో మలింగ తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ లాంటి ఇద్దరు ముఖ్యమైన బ్యాటర్ల వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన వల్లే బెంగళూరు జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రజత్ పటీదార్, క్రునాల్ పాండ్య 84 పరుగుల భాగస్వామ్యంతో బెంగళూరును పతనం నుంచి కాపాడారు. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలవడానికి బెంగళూరుకు కనీసం 160 పరుగులు అవసరం కాగా, వారు 200 పరుగులు చేసి ఆ లక్ష్యాన్ని అందుకున్నారు. దీంతో గుజరాత్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనుండగా, హైదరాబాద్ మూడో స్థానంతో ఎలిమినేటర్కు పరిమితమైంది.
డ్రెస్సింగ్ రూమ్లో జరిగే ఇలాంటి సరదా సంఘటనలు ఆటగాళ్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఒక చిన్న అవార్డు రానంత మాత్రాన ఇషాన్ కిషన్ ప్రతిభ తగ్గిపోదు. ఈ సీజన్లో 14 మ్యాచుల్లో 40.64 సగటుతో 6 వికెట్ల నష్టానికి 569 పరుగులు చేసిన కిషన్, పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో జట్టును కెప్టెన్గా ముందుండి నడిపించాడు. ఈ నవ్వుల పువ్వుల సంఘటనను పక్కనబెడితే, ప్లేఆఫ్స్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషనే అత్యంత కీలకమైన అస్త్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




