IPL 2026 : ఐపీఎల్ 2026 సమరం షురూ.. బెంగళూరు పగ తీర్చుకుంటుందా? సన్రైజర్స్ మళ్లీ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా?
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రేపు (మార్చి 28) తలపడనుంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రేపు (మార్చి 28) తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే గత సీజన్ చేదు జ్ఞాపకాలు ఆర్సీబీని వెంటాడుతున్నాయి. ఐపీఎల్ 2025లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏకైక పోరులో హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్ కిషన్ 5 సిక్సర్లతో విరుచుకుపడి, కేవలం 48 బంతుల్లోనే 94 పరుగులు సాధించి ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అభిషేక్ శర్మ కూడా 17 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 189 పరుగులకే పరిమితమై, 42 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు ఆ పాత పగను తీర్చుకుని, సీజన్ను విజయంతో ప్రారంభించాలని బెంగళూరు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఒక గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. అకిలెస్ హీల్ సమస్యతో బాధపడుతున్న హేజిల్వుడ్ లేకపోవడం బెంగళూరు బౌలింగ్ విభాగానికి పెద్ద మైనస్ అని చెప్పాలి. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో హేజిల్వుడ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతను లేని సమయంలో ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ వంటి ప్రమాదకరమైన హిట్టర్లను అడ్డుకోవడం బెంగళూరు బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. మరోవైపు, గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండటం ఆ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది.
గణాంకాల పరంగా చూస్తే సన్రైజర్స్ హైదరాబాద్దే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 25 నుంచి 26 మ్యాచ్లలో హైదరాబాద్ 14 సార్లు విజయం సాధించగా, బెంగళూరు కేవలం 11 సార్లు మాత్రమే గెలిచింది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన 8 మ్యాచ్లలో బెంగళూరు 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో హైదరాబాద్ రికార్డును తిరగరాయాలని విరాట్ కోహ్లీ సేన పట్టుదలతో ఉంది.
ఈ రెండు జట్ల పోరులో రికార్డుల విషయానికి వస్తే, అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ హైదరాబాద్పై 805 పరుగులు చేసి టాప్లో కొనసాగుతున్నాడు. అలాగే అత్యధిక సిక్సర్ల రికార్డు డేవిడ్ వార్నర్ (33 సిక్సర్లు) పేరిట ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును జానీ బెయిర్స్టో (114 పరుగులు) కలిగి ఉన్నాడు. ఒకానొక మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ కేవలం 68 పరుగులకే కుప్పకూలడం ఆ జట్టు చరిత్రలో అత్యల్ప స్కోరుగా నమోదైంది. అదే సమయంలో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు (287/3) రికార్డు కూడా ఆర్సీబీపైనే హైదరాబాద్ నమోదు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్లో బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతుందో లేక బౌలర్లు మ్యాజిక్ చేస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
