
IPL 2026 Playoffs Scenario: ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న కొద్దీ ఉత్కంఠ పతాక స్థాయికి చేరుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (18 పాయింట్లు), గుజరాత్ టైటాన్స్ (16 పాయింట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (16 పాయింట్లు) అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలింది కేవలం నాలుగో స్థానం మాత్రమే. లక్నోపై రాజస్థాన్ సాధించిన విజయంతో ఈ ఆఖరి స్థానం కోసం పోటీ పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. లీగ్ దశ ఆఖరి మ్యాచ్ వరకు ఏ జట్టు ముందంజ వేస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో బలంగా నిలవగా, పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. చెన్నై, ఢిల్లీ చెరో 12 పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రెండు మ్యాచ్లు చేతిలో ఉన్న కోల్కతా 11 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.
లక్నోపై గెలుపుతో సంజూ శాంసన్ సేన ప్లేఆఫ్స్కు అత్యంత చేరువగా వచ్చింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, మే 24న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో తన ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ముంబైని ఓడిస్తే రాజస్థాన్ నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసివచ్చే అంశం. ఒకవేళ గుజరాత్, హైదరాబాద్ జట్లు తమ ఆఖరి మ్యాచ్ల్లో భారీ తేడాతో ఓడిపోయి, రాజస్థాన్ పెద్ద విజయంతో ముగిస్తే టాప్-2లోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోతే మాత్రం మిగిలిన జట్లకు సువర్ణావకాశం లభిస్తుంది.
సీజన్ ద్వితీయార్థంలో తడబడిన పంజాబ్ కింగ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్, మే 23న లక్నో సూపర్ జాయింట్స్తో తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే లక్నోపై పంజాబ్ ఖచ్చితంగా గెలవాలి. అప్పుడు ఆ జట్టు 15 పాయింట్లకు చేరుకుంటుంది. కేవలం గెలిస్తేనే సరిపోదు, ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలని పంజాబ్ ప్రార్థించాలి. ఒకవేళ కోల్కతా తన రెండు మ్యాచ్ల్లో గెలిచి 15 పాయింట్లకు వస్తే, అప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.
కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి కాస్త ఆసక్తికరంగా ఉంది. మిగిలిన జట్ల కంటే కోల్కతా చేతిలో మరో రెండు మ్యాచ్లు ఉన్నాయి. మే 20న ముంబై ఇండియన్స్తో, మే 24న ఢిల్లీ క్యాపిటల్స్తో ఈ జట్టు తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ కోల్కతా ఖచ్చితంగా విజయం సాధిస్తేనే 15 పాయింట్లతో రేసులో ఉంటుంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కోల్కతా ప్లేఆఫ్స్ కల చెదిరిపోతుంది. రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు రాజస్థాన్, పంజాబ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్ల్లో ఓడిపోవాలని కోల్కతా కోరుకోవాలి.
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు చాలా సన్నగిల్లాయి. మే 21న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో చెన్నై భారీ తేడాతో గెలవడం అత్యంత అవసరం. కేవలం గుజరాత్పై గెలిస్తేనే సరిపోదు.. ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోవాలి, పంజాబ్పై లక్నో గెలవాలి, కోల్కతా తన రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి. ఇవన్నీ జరిగితేనే చెన్నైకి అవకాశం ఉంటుంది. పైగా నెట్ రన్ రేట్ (-0.016) మైనస్లో ఉండటం చెన్నైకి పెద్ద మైనస్.
ఢిల్లీ క్యాపిటల్స్ సాంకేతికంగా రేసులో ఉన్నప్పటికీ, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మే 24న కోల్కతాతో జరిగే మ్యాచ్లో ఢిల్లీ భారీ విజయాన్ని అందుకోవాలి. దాంతో పాటు రాజస్థాన్, పంజాబ్, చెన్నై జట్లు తమ ఆఖరి మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోవాలి. ఇవన్నీ జరిగినా ఢిల్లీ నెట్ రన్ రేట్ (-0.871) చాలా ఘోరంగా ఉండటంతో, వారు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిషబ్ పంత్ సేన ముందడుగు వేయలేదు.
ఇది కూడా చదవండి: IPL 2026: ఇదేందిది.. ప్లేఆఫ్స్కు చెన్నై టీం.. టాప్ 4 కోసం పెద్ద ప్లాన్ చేశారుగా..!
మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంటున్న వేళ క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే వారి ప్లేఆఫ్స్ లక్ ఉండగా, చెన్నై, పంజాబ్, కోల్కతా జట్లు మాత్రం తమ విజయాలతో పాటు ఇతరుల ఓటములపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే నాలుగు రోజుల్లో జరిగే ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ మ్యాచ్ను తలపించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..