Virat Kohli : ఐపీఎల్ 2026 ఆరంభంలోనే కోహ్లీ ఊచకోత.. డేవిడ్ వార్నర్ వరల్డ్ రికార్డు బద్దలు
Virat Kohli : ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ ఛేజింగ్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. ఆరు ఐపీఎల్ జట్లపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం వార్నర్నే కాదు, ఐపీఎల్లోని ఆరు జట్లపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు.

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్లోనే కింగ్ కోహ్లీ తన రికార్డుల వేటను మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లీ బ్యాట్ పడితే చాలు, ఏదో ఒక రికార్డు బద్దలవ్వాల్సిందే. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లోనే కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి, ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆడుతున్న డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న ఒక పవర్ఫుల్ రికార్డును తుడిచిపెట్టేశాడు. కేవలం వార్నర్నే కాదు, ఐపీఎల్లోని ఆరు జట్లపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి తన పవర్ ఏంటో నిరూపించుకున్నాడు.
ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వార్నర్ 79 ఇన్నింగ్స్ల్లో 41 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించగా, విరాట్ కోహ్లీ తన 126వ ఇన్నింగ్స్లో 42వ సారి ఈ ఘనత సాధించి వార్నర్ను అధిగమించాడు. ఇన్నింగ్స్ పరంగా వార్నర్ వేగంగా ఉన్నా, సుదీర్ఘ కాలం పాటు అదే ఫామ్ కొనసాగిస్తూ కోహ్లీ ఇప్పుడు ఛేజింగ్ కింగ్గా అవతరించాడు.
ఐపీఎల్ 2026 ఓపెనింగ్ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆరు వేర్వేరు జట్లపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి అందరికంటే టాప్లో కూర్చున్నాడు. ఈ లిస్టులోకి తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కూడా చేరిపోయింది. ఎస్ఆర్హెచ్పై 874 పరుగులు చేసిన కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (867 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. దీనితో పాటు పంజాబ్ కింగ్స్, సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్పై కూడా కోహ్లీయే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఏ జట్టూ వదలకుండా పరుగులు పిండేశాడు. పంజాబ్ కింగ్స్పై అత్యధికంగా 1159 పరుగులు చేసిన విరాట్, చెన్నై సూపర్ కింగ్స్పై 1146 పరుగులు సాధించి తన పవర్ను చూపించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్పై 1130 రన్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్పై 896 పరుగులు, గుజరాత్ టైటాన్స్పై 351 పరుగులు చేసి ఆ జట్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇలా ఆరు జట్లకు పీడకలలా మారడం కోహ్లీకే సాధ్యమైంది.
ఐపీఎల్ 2026 డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీకి కోహ్లీ ఊహించని ఊపునిచ్చాడు. ఛేజింగ్లో విరాట్ ఆడిన తీరు చూస్తుంటే, ఈ సీజన్ రికార్డుల సునామీకి ఇదొక శాంపిల్ మాత్రమే అని అర్థమవుతోంది. వార్నర్ వంటి దిగ్గజాల రికార్డులను చెరిపేస్తూ, వరుసగా 19వ సీజన్ ఆడుతున్న కోహ్లీలో ఏమాత్రం పరుగుల దాహం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది. మ్యాచ్ గెలవడంతో పాటు ఇన్ని రికార్డులు ఖాతాలో వేసుకోవడం ఆర్సీబీ అభిమానులకు అసలైన పండగ లాంటి వార్త.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
