IPL 2025: వార్ వల్ల మధ్యలో ఆగిపోయిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్! రీస్టార్ట్ తరువాత మళ్ళీ జరుగనుందా?
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా IPL 2025 తాత్కాలికంగా నిలిపివేయబడింది. ధర్మశాలలో జరిగిన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. కానీ టోర్నీ తిరిగి ప్రారంభమైన వెంటనే ఈ మ్యాచ్ మళ్లీ జరుగనుందని సమాచారం. మిగిలిన మ్యాచ్లను భారత్లో నిర్వహించాలా లేదా ఇతర దేశాల్లోనో అనే విషయం పై బీసీసీఐ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

భారతీయ క్రికెట్ అభిమానులను కలవరపరిచిన పరిణామాల్లో, BCCI తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ను పునఃప్రారంభించనున్నట్లు స్పష్టమైంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతున్న సాయుధ ఘర్షణల కారణంగా టోర్నమెంట్ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల మధ్య ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్ను కూడా మధ్యలోనే రద్దు చేయాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన సమయంలో పంజాబ్ కింగ్స్, టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టి, పది ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 122 పరుగులు చేసింది. కానీ పరిస్థితులు వేడెక్కిన వెంటనే HPCA స్టేడియాన్ని ఖాళీ చేయించడమేకాక, ఆటగాళ్లు, ప్రేక్షకులు, అంపైర్ల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకున్నారు. ఆట రద్దైన అనంతరం, ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో, క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించే విషయం ఏమంటే, టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైన వెంటనే PBKS vs DC మధ్య మ్యాచ్ మళ్లీ జరగనున్నదని ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ నివేదించింది. అయితే ఈ మ్యాచ్ టాస్ నుండి మళ్లీ ఆరంభమవుతుందా లేక రద్దు అయిన దశనుంచే కొనసాగుతుందా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, IPL 2025 మిగిలిన మ్యాచ్లు ఎక్కడ నిర్వహించబడతాయన్న దానిపై ఇంకా BCCI అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సరిహద్దు పరిస్థితులు త్వరలో సమన్వయ స్థితికి వస్తే, మిగతా టోర్నమెంట్ను తిరిగి భారతదేశంలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, బీసీసీఐ బ్యాకప్ వేదికల కోసం కూడా సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ IPL మ్యాచ్ల నిర్వహణకు ఆసక్తిని చూపించినట్టు సమాచారం. UAE, దక్షిణాఫ్రికా వేదికలు కూడా ప్రత్యామ్నాయ స్థానాలుగా పరిశీలనలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. IPL లాంటి బహుళ దేశాల ఆటగాళ్లతో కూడిన టోర్నీకి భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిన నేపథ్యంలో, BCCI ఈ అంశంపై చురుగ్గా స్పందిస్తూ తదుపరి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, PBKS vs DC మ్యాచ్ మళ్లీ జరగనున్నందున క్రికెట్ అభిమానులు ఆ క్షణాన్ని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..