IPL 2024: ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీకి భారీ షాక్.. కెప్టెన్ రిషభ్ పంత్‌పై నిషేధం.. కారణమిదే

గుజరాత్ టైటాన్స్ శుక్రవారం (మే 10వ తేదీ) చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడంతో లక్నో, RCB, ఢిల్లీ జట్లకు ఆక్సిజన్ అందించినట్లయింది. ప్రస్తుతం పంజాబ్, ముంబై మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్లేఆఫ్ రేసు కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది.

IPL 2024: ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీకి భారీ షాక్.. కెప్టెన్ రిషభ్ పంత్‌పై నిషేధం.. కారణమిదే
Captain Rishabh Pant

Updated on: May 11, 2024 | 5:10 PM

ఐపీఎల్ 17వ సీజన్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ముగిసినా ఏ జట్టు కూడా ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోవడమే ఇందుకు నిదర్శనం. టోర్నీ నుండి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నిష్క్రమించడంతో 4 ప్లేఆఫ్ స్థానాల కోసం 8 జట్ల హోరాహోరీగా పోటీపడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ శుక్రవారం (మే 10వ తేదీ) చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడంతో లక్నో, RCB, ఢిల్లీ జట్లకు ఆక్సిజన్ అందించినట్లయింది. ప్రస్తుతం పంజాబ్, ముంబై మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్లేఆఫ్ రేసు కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఈ కారణంగా పంత్ రాబోయే మ్యాచ్‌లో కూడా ఆడలేడు. కాబట్టి ప్రస్తుతానికి పంత్ గైర్హాజరీలో ఢిల్లీ బరిలోకి దిగాల్సి ఉంటుంది. పంత్ ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో అతనిపై బీసీసీఐ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో మే 12న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో పంత్ ఆడలేడు.

ఐపీఎల్ 17వ సీజన్ 56వ మ్యాచ్‌లో మే 7న రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ కారణంగానే పంత్ పై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. కెప్టెన్‌గా స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ పెనాల్టీకి గురికావడం ఇది మూడోసారి. మొదటి 2 సార్లు మాత్రమే జరిమానా విధిస్తారు. కానీ మూడోసారి నేరుగా ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. దీని ప్రకారమే ఇప్పుడు పంత్‌పై చర్యలు తీసుకున్నారు. అంతే కాదు పంత్ జరిమానాగా రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌లతో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన ఆటగాళ్లు ఆ మ్యాచ్ రెమ్యునరేషన్‌లో 50 శాతం పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీకి ఇది పెద్ద దెబ్బ అని భావించవచ్చు.

ఇవి కూడా చదవండి

IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 8 ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని బీసీసీఐ సంబంధిత కమిటీకి నివేదించింది. దీనిని విచారించిన బీసీసీఐ మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని సమర్థిస్తూ పంత్ పై కఠిన చర్యలకు ఆదేశించింది. కాగా, ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయి. మే 12న ఆర్సీబీ, 14 తేదీన లక్నోతో పంత్ సేన మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ఢిల్లీకి తప్పనిసరి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..