AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

shreyas iyer captaincy record: ​ప్రపంచ విజేతగా నిలిచిన జట్టు ఇలా వరుసగా ఘోర పరాజయాలు పాలుకావడం అభిమానుల మనసులను గాయపరుస్తోంది. ఒకరోజు విరామం తర్వాత గురువారం బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లోనైనా భారత్ పుంజుకుని, తన పరువును నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
Shreyas Iyer Captaincy Record
Venkata Chari
|

Updated on: Jul 08, 2026 | 6:42 AM

Share

ప్రపంచ ఛాంపియన్లుగా సగర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు కాలం కలిసిరావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆటతీరు చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. ​భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘోరమైన పరాజయం నమోదైంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే, భారత జట్టు వరుస ఓటములతో కుదేలవుతోంది. మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా, కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి తలదించుకుంది.

​శ్రేయాస్ అయ్యర్ పేరిట అత్యంత దారుణమైన రికార్డు..

​ముంబైకి చెందిన శ్రేయాస్ అయ్యర్ ఎంతో నైపుణ్యం గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రస్తుత బ్రిటన్ పర్యటనలో అతని కెప్టెన్సీ పూర్తిగా గాడి తప్పింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన అయ్యర్, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఐదు మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారతీయ కెప్టెన్‌గా నిలిచాడు.

ఐదు మ్యాచ్‌లలోనే నాలుగు ఓటములను చవిచూసి అయ్యర్ ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. గతంలో విరాట్ కోహ్లీ నాలుగు ఓటములను చూడటానికి తొమ్మిది మ్యాచ్‌లు పట్టగా, మహేంద్ర సింగ్ ధోనీకి 12 మ్యాచ్‌లు పట్టింది. అయ్యర్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నప్పటికీ, నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలమవుతున్నారు. గతంలో మాంచెస్టర్ మ్యాచ్ ఓటమికి రవి బిష్ణోయ్‌ను బలిపశువును చేస్తూ అయ్యర్ మాట్లాడిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

​ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్ విధ్వంసం.. కుప్పకూలిన భారత్

​నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ 70 పరుగులతో మెరుపు దాడి చేయగా, సామ్ కరన్ ఆఖర్లో 41 పరుగులతో రెచ్చిపోయాడు. ​భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ సిక్సర్లతో మురిపించినా ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ల పదునైన బౌలింగ్‌కు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా భారత్ పవర్‌ప్లే లోపలే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో కేవలం 76 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ నాలుగు వికెట్లు తీయగా, మూడు వికెట్లు తీసిన ఆర్చర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

​అయ్యర్, గంభీర్ ద్వయం మారాల్సిందే..

​ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 0-2తో వెనుకబడి ఉంది. దీనివల్ల సిరీస్ గెలిచే అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో రాబోయే జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడలు అయ్యర్ కెప్టెన్సీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి.

Follow Us