IND vs SL : వీరేంద్ర సెహ్వాగ్ నుంచి విరాట్ కోహ్లీ వరకు.. శ్రీలంకపై డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
IND vs SL : శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ లంకపై డబుల్ సెంచరీలు బాదిన భారత దిగ్గజాల జాబితా ఆసక్తికరంగా మారింది. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు, భారత్, శ్రీలంక WTC పరిస్థితులు, సిరీస్ షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.

IND vs SL : శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు మంగళవారం మధ్యాహ్నం కొలంబో చేరుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా, దానికి ముందు ఆగస్టు 7 నుంచి 9 వరకు భారత జట్టు శ్రీలంక XIతో 3 రోజుల పాటు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, ఇప్పటివరకు 1 డబుల్ సెంచరీ, 5 సెంచరీలు బాది పవర్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అయితే శ్రీలంకపై టెస్టు చరిత్రలో భారత్ తరఫున ఇప్పటివరకు కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే డబుల్ సెంచరీలు సాధించడం గమనార్హం.
లంకపై డబుల్ సెంచరీ కొట్టిన ఆ ముగ్గురు భారత వీరులు వీరే
శ్రీలంక బౌలింగ్ను చీల్చిచెండాడి టెస్టుల్లో డబుల్ సెంచరీ మార్కును అందుకున్న ఆ ముగ్గురు దిగ్గజాల వివరాలు ఇవే:
వీరేంద్ర సెహ్వాగ్: లంకపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్గా సెహ్వాగ్ రికార్డు నెలకొల్పారు. 2009లో బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన టెస్టులో ఆయన 40 ఫోర్లు, 7 సిక్సర్లతో 293 రన్స్ చేసి త్రిబుల్ సెంచరీకి అతి సమీపంలో నిలిచారు. అంతకుముందు 2008లో గాళ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కూడా ఆయన నాటౌట్గా 201 రన్స్ చేశారు.
విరాట్ కోహ్లీ: శ్రీలంకపై టెస్టుల్లో రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించిన మరో ఘనుడు విరాట్ కోహ్లీ. నవంబర్ 2017లో నాగ్పూర్లో జరిగిన టెస్టులో 213 పరుగులు చేసిన కోహ్లీ, ఆ తర్వాతి మ్యాచ్లోనే డిసెంబర్ 2017లో ఢిల్లీ వేదికగా 243 రన్స్ బాది వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు.
సచిన్ టెండూల్కర్: క్రికెట్ దేవుడిగా కీర్తించబడే సచిన్ టెండూల్కర్ జూలై 2010లో కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్లో 23 ఫోర్లు, 1 సిక్సర్తో 203 పరుగులతో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడారు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్, లంక స్థానాలు
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2025-27) పాయింట్ల పట్టికలో టీమిండియా 5వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి, 4 ఓడిపోయింది. మరొకవైపు శ్రీలంక జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లో 1 విజయం, 1 ఓటమి, 2 డ్రాలతో భారత్ కంటే ఒక స్థానం కింద 6వ స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ సిరీస్ విజయం ఎంతో అత్యవసరం.
భారత టెస్టు జట్టు, పూర్తి షెడ్యూల్
శ్రీలంక టెస్టు సిరీస్కు భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ.
భారత్ vs శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ (2026):
3 రోజుల వార్మప్ మ్యాచ్: ఆగస్టు 07 నుంచి 09 వరకు (భారత్ vs శ్రీలంక XI)
తొలి టెస్టు: ఆగస్టు 15 నుంచి 19 వరకు (గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉదయం 10 గంటల నుంచి)
రెండో టెస్టు: ఆగస్టు 23 నుంచి 27 వరకు (సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో, ఉదయం 10 గంటల నుంచి)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
