Champions Trophy: రేపే ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్! టీమిండియా ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ ఇదే?
2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. దుబాయ్లో జరిగే ఈ కీలకమైన మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఫైనల్కు చేరుకోవాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అంచనా. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్ ఎలెవెన్తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. మరి ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది దశకు చేరుకుంది. మరో మూడు మ్యాచ్ల్లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ ఎవరో తేలిపోనుంది ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా.. ఈ నాలుగు టీమ్స్లో ఏ జట్టు వరుసగా రెండు మ్యాచ్లు గెలుస్తుందో ఆ జట్టే ఛాంపియన్గా నిలుస్తుంది. ఇక టీమిండియా తొలి సెమీ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాను సెమీస్లో ఓడిస్తే.. ఫైనల్లో సౌతాఫ్రికా లేదా న్యూజిలాండ్తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్ చేరాలంటే ముందు సెమీస్లో ఆసీస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది.
గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్లో ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్లలో ఓడించిన ఘనమైన రికార్డ్ టీమిండియాకు ఉంది. కానీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన ఆసీస్ చేతుల్లో ఓటమి పాలైంది. దానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో కంగారులను ఓడించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇన్ని భావోద్వేగాలతో మధ్య జరగబోయే ఈ మ్యాచ్కు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగబోతుంది? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? వర్షం వచ్చే అవకాశం ఉందా? రోహిత్ శర్మ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాడా? ఫీల్డింగ్ తీసుకుంటాడా? ఏది తీసుకుంటే మంచిది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఈ మ్యాచ్ 2025 మార్చి 4న మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత క్రికెట్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అలాగే జియోహాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. ఇక మ్యాచ్ జరిగే రోజు దుబాయ్లో ఉష్ణోగ్రత 24°C చుట్టూ ఉంటుందని అంచనా. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని, కానీ, మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఒక వేళ రోహిత్ శర్మ టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపుతాడని తెలుస్తోంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా కేవలం 250 పరుగుల టార్గెట్ను రక్షించుకోగలిగింది. సో.. సెమీస్లో కూడా రోహిత్ సేమ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.
కానీ, ఈ పిచ్పై 63 శాతం ఛేజింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ అంత సులువగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత కూడా రోహిత్ ప్రస్తావించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డ్ చూసుకుంటే టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. రెండు సార్లు టీమిండియా గెలిచింది. ఒక మ్యాచ్లో ఆసీస్ గెలవగా, ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక టీమిండియా న్యూజిలాండ్పై ఆడిన జట్టుతోనే ఆసీస్పై కూడా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు, ఒక పేసర్, ముగ్గురు ఆల్రౌండర్లతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది.
టీమిండియా ప్లేయింగ్ 11(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11(అంచనా): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.