ఆ 24 పాయింట్లు మస్ట్.. టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
India Tour of New Zealand 2026: శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు తర్వాతి రెడ్ బాల్ సమరం ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు భారత టెస్టు మ్యాచ్లను చూడాలంటే కాస్త ఎక్కువ సమయమే వేచి చూడాల్సి ఉంటుంది. కివీస్ గడ్డపై జరగనున్న ఈ కీలక పోరు తేదీలు, మ్యాచ్ సమయాల వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి.

India Tour of New Zealand 2026: కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ఆగస్టు 27తో ముగియనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత జట్టు సుదీర్ఘ ఫార్మాట్కు కాస్త విరామం ఇచ్చి పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి సారించనుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వైట్ బాల్ మ్యాచ్లతో బిజీగా గడపనున్న టీమిండియా, ఆ తర్వాత నవంబర్ 2026 లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 చక్రంలో భాగంగా ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. కివీస్ పిచ్లపై పేస్, స్వింగ్, అదనపు బౌన్స్ ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో భారత బ్యాటర్లు, బౌలర్లకు ఇది కఠినమైన అగ్నిపరీక్షగా నిలవనుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్.. తెల్లవారుజామునే మొదలయ్యే మ్యాచ్లు..
టెస్టు సిరీస్కు ముందు భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22 నుంచి 5 టీ20లు, ఆ తర్వాత నవంబర్లో 5 వన్డేలు జరగనున్నాయి. వైట్ బాల్ సిరీస్ పూర్తయ్యాక రెండు టెస్టుల సమరం ప్రారంభం కానుంది:
మొదటి టెస్టు: నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతుంది.
రెండో టెస్టు: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా సాగుతుంది.
ఈ రెండు మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు మొదలవుతాయి. అయితే భారత కాలమానం ప్రకారం ఉదయం 3:00 గంటలకు టాస్, తెల్లవారుజామున 3:30 గంటలకే మొదటి బంతి పడుతుంది. క్రికెట్ ప్రేమికులు మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలంటే తెల్లవారుజామునే మేల్కోవాల్సి ఉంటుంది.
WTC ఫైనల్ రేసు.. 24 పాయింట్ల కోసం బిగ్ ఫైట్..
న్యూజిలాండ్తో జరిగే ఈ రెండు టెస్టుల సిరీస్ టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ భవితవ్యాన్ని తేల్చడంలో కీలక పాత్ర పోషించనుంది. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం టెస్టు గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి. రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే భారత్కు ఏకంగా 24 పాయింట్లు లభించే గొప్ప అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కివీస్ జట్టు సైతం ఫైనల్ రేసులో పోటీపడుతుండటంతో ఈ సిరీస్ పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపనుంది. రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంటేనే భారత్ ఫైనల్ ఆశలు మరింత సజీవంగా ఉంటాయి.
శ్రీలంక పర్యటన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కు దూరంగా ఉండే భారత జట్టు, నవంబర్లో కివీస్ సవాలును స్వీకరించనుంది. ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగే టీమిండియాకు న్యూజిలాండ్ గడ్డపై జరిగే ఈ పోరాటం అసలైన పరీక్షగా మారనుంది.




