ODI World Cup: కోహ్లీ ఇన్.. రోహిత్ డౌట్.. ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లు ఫిక్స్..?
Team Indias Probable Squad for the 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్నకు భారత జట్టు కూర్పుపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయంగా కనిపిస్తుండగా, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉంది. ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.

Team Indias Probable Squad for the 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ దగ్గరపడుతున్న వేళ, భారత క్రికెట్ జట్టుపై దేశవ్యాప్తంగా చర్చ ఊపందుకుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్కు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. దీంతో అభిమానులలో, విశ్లేషకులలో ఆసక్తి మొదలైంది. అసలు భారత జట్టులో ఎవరు ఉంటారు, ఎవరిని పక్కన పెడతారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చకు బీసీసీఐ సంకేతాలు మరింత బలాన్ని చేకూర్చాయి.
ఈక్రమంలో భారత జట్టులో సీనియర్ ఆటగాళ్ల ఫ్యూచర్పై కొన్నాళ్లుగా సందేహాలు ఉన్నా, తాజాగా బోర్డ్ నిర్వహించిన సమావేశం తర్వాత రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్లో ఆడతాడని బీసీసీఐ నుంచి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ స్థానం దాదాపు ఖాయమైంది. ఇది భారత బ్యాటింగ్ లైనప్కు అనుభవాన్ని, స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇక భారత జట్టుకు ఫ్యూచర్ కెప్టన్గా శుభ్మన్ గిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతను ఓపెనర్గా రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశం ఉంది. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం దాదాపు ఖాయం. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో కొనసాగే అవకాశం ఉంది, గత వన్డే ప్రపంచకప్లోనూ రాహులే వికెట్ కీపర్గా సేవలు అందించిన సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినది: అగార్కర్పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా.. బయటపడ్డ సంచలన నిజాలు..?
మరో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఆసక్తికరంగా ఉంది. ఇషాన్ కిషన్ ఈ రేసులో ముందున్నాడు. అయితే రిషబ్ పంత్ కోలుకుని తిరిగి వస్తే అతనికి కూడా చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్ రౌండర్ల విభాగంలో, హార్దిక్ పాండ్యా మొదటి ఎంపిక పేస్ ఆల్ రౌండర్గా ఆరో స్థానంలో ఆడటం ఖాయం. మరో పేస్ ఆల్ రౌండర్ నితీష్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ ఆల్ రౌండర్గా అక్షర్ పటేల్ స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా 15 మంది సభ్యుల జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.
స్పెషలిస్ట్ స్పిన్నర్ విషయానికి వస్తే, కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. గత కొంతకాలంగా కుల్దీప్ యాదవ్కు ప్రాధాన్యత తగ్గుతోంది. దీంతో సీనియర్ స్పిన్నర్ను తీసుకుంటారా లేదా అనే చర్చ ఎక్కువగా సాగుతోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్గా వ్యవహరిస్తాడు. మహమ్మద్ షమీ కూడా జట్టులో చోటు దక్కించుకోవాలని చర్చ జరుగుతోంది. గత వన్డే ప్రపంచకప్లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వికెట్ల వేటలో దూసుకుపోయి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, గత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీకి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. పేస్ విభాగంలో స్థానాల కోసం మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లు కూడా పోటీలో ఉన్నారు. ఐపీఎల్లో రాణించిన భువనేశ్వర్ కుమార్కు కూడా మరో అవకాశం ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా, 2027 వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ఎంపికపై ఇప్పటి నుంచే జోరుగా చర్చ నడుస్తోంది. జట్టు కూర్పు, ఆటగాళ్ల ప్రదర్శనలు, ఫిట్నెస్ వంటి అనేక అంశాలు రాబోయే కాలంలో తుది జట్టు ఎంపికను ప్రభావితం చేయనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




