IND vs SL: 13 ఏళ్ల తర్వాత టీమిండియాపై సిరీస్‌ గెలిచిన శ్రీలంక.. బర్త్‌డే బాయ్ హసరంగ మాయాజాలం.. చెత్త రికార్డులో చేరిన ధావన్

గురువారం రాత్రి జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీ 20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్నారు. శ్రీలంక జట్టుకు తొలి ద్వైపాక్షిక టీ 20 సిరీస్ విజయం ఎట్టకేలకు అందింది.

IND vs SL: 13 ఏళ్ల తర్వాత టీమిండియాపై సిరీస్‌ గెలిచిన శ్రీలంక.. బర్త్‌డే బాయ్ హసరంగ మాయాజాలం.. చెత్త రికార్డులో చేరిన ధావన్
Ind Vs Sl Srilanka Win T20 Series Vs India
Follow us

|

Updated on: Jul 30, 2021 | 6:52 AM

IND vs SL: గురువారం రాత్రి జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీ 20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్నారు. శ్రీలంక జట్టుకు తొలి ద్వైపాక్షిక టీ 20 సిరీస్ విజయం ఎట్టకేలకు అందింది. ఇంతకు ముందు ఇరుజట్ల మధ్య 2009/10ల మధ్య 7 సిరీస్‌లు జరగగా.. టీమిండియా 6 సిరీస్‌లను గెలుచుకుంది. మరొకటి డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు చేసింది. శ్రీలంక స్పిన్నర్ హసరంగ భారత బ్యాట్స్‌మెన్లను చావుదెబ్బ కొట్టాడు. గురువారం ఆయన పుట్టినరోజు కావడం విశేషం. కేవలం 9 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అనంతరం శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు చేసి మ్యాచ్‌తో పాటు 2-1తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ధనంజయ్ డి సిల్వా 23 పరుగులు, హసరంగ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. హసరంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా లభించింది.

2019/20 తర్వాత.. ఈ పర్యటనలో శ్రీలంక మొదటి సిరీస్‌ను గెలుచుకుంది. కాగా, 2008 ఆగస్టు తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత్‌పై 21 ద్వైపాక్షిక సిరీస్‌లలో శ్రీలంక సాధించిన మొదటి విజయం ఇదే కావడం విశేషం. శ్రీలంక గత ఐదు సిరీస్‌లలో వరుసగా ఓడిపోయింది. శ్రీలంక చివరిసారిగా 2019 లో టీ20 లో పాకిస్థాన్‌ను 3-0తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. గత 9 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఇది మొదటి ఓటమి. అంతకుముందు 8 సిరీస్‌లలో భారత్ 7 సిరీస్‌లను గెలుచుకుని, 1 సిరీస్‌ను డ్రా చేసుకుంది. రాహుల్ చాహర్ ఈ మ్యాచులో 3 వికెట్లు తీశాడు. ఆరో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండో(12 పరుగులు) క్యాచ్ అందుకోగా, 8 వ ఓవర్లో మినోద్ భానుకాను(18 పరుగులు) ఎల్బీడబ్య్లూగా పెవిలియన్ పంపించాడు. చాహర్ సమర్విక్రమను(6 పరుగులు) క్లీన్ బౌల్డ్ చేశాడు.

శ్రీలంకపై అత్యల్ప స్కోరు టీమిండియా శ్రీలంకపై అత్యల్ప స్కోరును నమోదుచేసింది. అంతకుముందు 2016 లో పూణేలో టీమిండియా 18.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యేకత ఏమిటంటే నిన్న జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన షనకా.. అప్పటి మ్యాచ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టాడు. టీ 20 లో టీమిండియా అత్యల్ప స్కోరు 74 పరుగులు. 2008 లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో ఈ అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫలమయ్యారు. ధావన్‌, సంజు శాంసన్ డక్ ఔట్‌గా వెనుదిరిగారు. టీమిండియాకు చెందిన 7 గురు బ్యాట్స్‌మెన్‌లు డబుల్ ఫిగర్‌ను కూడా చేరలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయారు. టీ 20 లో భారత ప్లేయర్లు సిక్స్‌ కొట్టకపోవడం ఇదే మొదటిసారి. హసరంగతో పాటు శ్రీలంక కెప్టెన్ దసున్ షనకా 2, దుష్మంత చమీరా, రమేష్ మెండిస్ చెరో వికెట్ తీశారు.

తొలి బంతికి ఔట్ అయిన మొదటి కెప్టెన్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ అయిన ధావన్.. టీమిండియా మొదటి కెప్టెన్‌గా చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. అంతకుముందు, 2017 లో గౌహతిలో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ సున్నాకి అవుట్ అయ్యాడు. అయితే, అది ఇన్నింగ్స్ రెండవ బంతికి ఔటయ్యాడు.

ఇరుజట్లలో రెండు మార్పులు టీమిండియా ఈ మ్యాచ్‌లో 5 బ్యాట్స్‌మెన్‌లు, 6 గురు బౌలర్లతో బరిలోకి దిగింది. ఫాస్ట్ బౌలర్ సందీప్ వారియర్ తొలి క్యాప్ అందుకున్నాడు. గాయపడిన నవదీప్ సైనీ స్థానంలో వారియర్ జట్టులో చేరాడు. అదే సమయంలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనకా జట్టులో ఓ మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉదనా స్థానంలో పాతుమ్ నిసాంకను తీసుకున్నాడు.

రెండు జట్లు ఇండియా: శిఖర్ ధావన్ (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కీపర్), నితీష్ రాణా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, సందీప్ వారియర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి శ్రీలంక: దాసున్ శనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుకా (కీపర్), ధనంజయ్ డి సిల్వా, సదర సమరవిక్రమ, రమేష్ మెండిస్, వనిందు హసరంగ, చమికా కరుణరత్నే, పాతుమ్ నిసంక, అకిల ధనంజయ, దుష్మంత చమీరా

Also Read: Tokyo Olympics 2020: నేడు ఒలింపిక్స్ బరిలో దీపికా కుమారి, సింధు, మను బాకర్, లవ్లీనా.. భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్..!

Minister KTR: మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి కేటీఆర్.. గిరిజన క్రీడాకారుడుకి చేయూత..

Tokyo Olympics 2020: బీచ్ వాలీబాల్‌లో బికినీ ధరించం.. ఈ సంప్రదాయంపై మహిళా అథ్లెట్లు సీరియస్..!