Ind vs Eng : భారత్ vs ఇంగ్లాండ్.. వరుణుడు కరుణిస్తాడా? మ్యాచ్ రద్దయితే ఫైనల్ బెర్తు దక్కేది ఎవరికి?
Ind vs Eng : ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం నేడు ఒక ఉత్కంఠభరిత పోరాటానికి వేదిక కానుంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారితే పరిస్థితి ఏంటి?

Ind vs Eng : ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియం నేడు ఒక ఉత్కంఠభరిత పోరాటానికి వేదిక కానుంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారితే పరిస్థితి ఏంటి? అసలు వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్కు ఎవరు వెళ్తారు? అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు ఫైనల్కు చేరుకోగా, నేటి విజేత ఆ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది.
వాతావరణ నివేదిక ప్రకారం.. ముంబైలో నేడు వర్షం కురిసే అవకాశం దాదాపు సున్నా శాతం (0%) అని అక్యూవెదర్ పేర్కొంది. అంటే మ్యాచ్కు ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ ఊహించని విధంగా వర్షం పడితే, ఐసీసీ నిబంధనల ప్రకారం నేడు అదనంగా 90 నిమిషాల సమయం కేటాయించారు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ సాధ్యం కాకపోతే, శుక్రవారం (మార్చి 6) రిజర్వ్ డేగా కేటాయించారు. ఆ రోజు కూడా మ్యాచ్ నిర్వహించేందుకు అదనంగా 120 నిమిషాల సమయం ఉంటుంది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగేలా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తారు.
నిబంధనల ప్రకారం.. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ పూర్తిగా జరుగకుండా పోతే, సూపర్ 8 పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇక్కడే టీమిండియాకు అసలైన చిక్కు వచ్చి పడింది. సూపర్ 8లో ఇంగ్లాండ్ తన గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ భారత్ తన గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచింది. కాబట్టి మ్యాచ్ రద్దయితే, గ్రూప్ టాపర్గా ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. అంటే, భారత్ ఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా ఇంగ్లాండ్ను మైదానంలో ఓడించాల్సిందే.
వాంఖడే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టును డీకొట్టేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత్ పక్కా వ్యూహాలతో సిద్ధమైంది. 2022లో ఎదురైన చేదు అనుభవాన్ని మరిచిపోయి, 2024 రివేంజ్ను ఇక్కడ కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత్ తుది జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శామ్సన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
ఇంగ్లాండ్ తుది జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్
