Match Fixing : 4 ఓవర్లలో 71 పరుగులు.. ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే అంటున్న నెటిజన్లు
Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ 2026లో షానవాజ్ దహానీ 4 ఓవర్లలో 71 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఎల్పీఎల్ పారదర్శకత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Match Fixing : లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ఫ్రాంచైజీల అవినీతి, షాహీన్ అఫ్రిది ఎంపికపై వివాదం, ఒక ఫ్రాంచైజీ యజమాని అరెస్ట్ వంటి వరుస పరిణామాలతో లీగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా ఈ సీజన్లో రెండు వారాల క్రికెట్ మిగిలి ఉండగానే, లీగ్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా మరో సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొలంబో క్యాప్స్, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జరిగిన ఓ పరిణామం లీగ్పై అభిమానులకు ఉన్న నమ్మకాన్ని మరింతగా సడలించింది.
కొలంబో క్యాప్స్ తరఫున బౌలింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీ ఈ మ్యాచ్లో దారుణమైన ప్రదర్శన ఇచ్చాడు. తన 4 ఓవర్ల స్పెల్లో ఏకంగా 6 ఎక్స్ట్రాలతో కలిపి 71 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ ఏమీ తీయలేకపోయాడు. తొలి ఓవర్లో వైడ్తో పరుగుల ఖాతా తెరిచి 6 పరుగులు ఇవ్వగా, రెండో ఓవర్లో జాఫ్నా బ్యాటర్లు విరుచుకుపడి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో తిరిగొచ్చిన దహానీ వరుసగా వైడ్లు, నోబాల్స్తో వైఫల్యం చెందాడు. ఇక చివరి ఓవర్లో తోహిద్ హృదోయ్ వరుసగా మూడు సిక్సర్లు, ఆపై మరో సిక్స్, ఫోర్తో ఒకే ఓవర్లో ఏకంగా 31 పరుగులు రాబట్టాడు.
ఎల్పిఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ నమోదవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ లీగ్లో పక్కాగా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, లీగ్ పారదర్శకతపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జాఫ్నా కింగ్స్ జట్టు యజమానుల్లో ఒకరైన మన్జోత్ కల్రాను శ్రీలంక పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసిన విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. క్యాచ్లను కావాలనే వదిలేస్తున్నారని, మ్యాచ్లో ఎలాంటి తీవ్రత లేకుండా 30 పరుగుల ఓవర్లు మామూలైపోయాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఒకప్పుడు అత్యుత్తమ టి20 బౌలర్గా పేరొందిన 27 ఏళ్ల దహానీకి ఇది అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పిఎస్ఎల్ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 20 వికెట్లు, తదుపరి సీజన్లో 17 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చిన దహానీ.. ఆ తర్వాత తీవ్ర గాయాల పాలయ్యాడు. 2022 ఆసియా కప్లో సైడ్ స్ట్రెయిన్, ఆపై వేలి విరిగడం, వీపు నొప్పితో పాటు 2024 చివర్లో మడమ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఫిట్నెస్పై దృష్టి పెట్టి గడచిన రెండేళ్లుగా గాయాలు లేకుండా ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్లో అతని సరైన గేమ్ ప్లాన్ లేకపోవడమే ఈ ఘోర పరాభవానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
