ఫోర్బ్స్ ఇండియా 2026 జాబితాలో మనోళ్లే తోపులు.. అత్యంత విలువైన టాప్-5 భారత క్రికెటర్లు వీరే..!
Forbes India 2026: ప్రతి సంవత్సరం లాగే, యావత్ కార్పొరేట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026' బ్రాండ్ వాల్యుయేషన్ జాబితాను విడుదల చేసింది. ఊహించినట్లుగానే, ఈసారి కూడా భారత క్రికెటర్లు మార్కెట్లో తమ దశాబ్దాల ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఈ జాబితాలో భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ, సచిన్, బుమ్రా, రోహిత్ శర్మ టాప్-5లో చోటు దక్కించుకున్నారు.

Forbes India 2026: భారత క్రికెటర్లకు మైదానంలోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ భారీ క్రేజ్ ఉంది. ఆటకు వీడ్కోలు పలికినా కొందరు దిగ్గజాల బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 జాబితాలో పలువురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు. మొత్తం భారత సెలబ్రిటీల్లోనూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
నంబర్ వన్.. విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్లలో అత్యంత విలువైన బ్రాండ్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతడి బ్రాండ్ విలువ ఏకంగా రూ.3,542 కోట్లుగా ఫోర్బ్స్ జాబితా పేర్కొంది.
కేవలం క్రికెటర్లలోనే కాదు.. దేశంలోని అన్ని రంగాల సెలబ్రిటీలను కలిపినా కోహ్లీదే అగ్రస్థానం. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి కోహ్లీ నంబర్ వన్గా నిలవడం విశేషం.
రెండో స్థానంలో ధోనీ..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ జాబితాలో రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. అతడి బ్రాండ్ విలువ రూ.2,141 కోట్లు.
క్రికెట్కు దూరమైనప్పటికీ ధోనీకి ఉన్న అభిమానగణం, వ్యాపార కార్యకలాపాలు, ప్రకటనల ఒప్పందాలు అతడి బ్రాండ్ విలువను భారీగా నిలబెట్టాయి. మొత్తం భారత సెలబ్రిటీల జాబితాలో ధోనీ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..!
మూడో స్థానంలో సచిన్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ జాబితాలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ బ్రాండ్ విలువ రూ.1,676 కోట్లుగా నమోదైంది.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయి ఎన్నో సంవత్సరాలు గడిచినా.. సచిన్ బ్రాండ్ ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. మొత్తం సెలబ్రిటీల జాబితాలో ఆయన 8వ స్థానంలో నిలిచాడు.
నాలుగో స్థానంలో బుమ్రా..
ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో అత్యంత విలువైన వారిలో ఒకడిగా నిలిచాడు. అతడి బ్రాండ్ విలువ రూ.1,142 కోట్లు.
ఫోర్బ్స్ జాబితాలో బుమ్రా మొత్తం 16వ స్థానంలో ఉన్నాడు. మైదానంలో భారత పేస్ దళానికి నాయకుడిగా ఎదిగిన బుమ్రా.. వాణిజ్యంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఐదో స్థానంలో రోహిత్ శర్మ..
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెటర్ల జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. అతడి బ్రాండ్ విలువ రూ.1,055 కోట్లు.
మొత్తం సెలబ్రిటీల జాబితాలో రోహిత్ 18వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడి విజయాలు, అభిమానుల్లో ఉన్న ఆదరణ, వాణిజ్య ఒప్పందాలు బ్రాండ్ విలువను పెంచడంలో కీలకంగా మారాయి.
టాప్-5 భారత క్రికెటర్లు.. బ్రాండ్ విలువ ఇదే
ఈ ఐదుగురి బ్రాండ్ విలువలను కలిపితే రూ.9,556 కోట్లు. క్రికెట్లో సాధించిన విజయాలతో పాటు వ్యక్తిగత ఇమేజ్, అభిమానుల ఆదరణ, ప్రకటనలు, వాణిజ్య భాగస్వామ్యాలు భారత క్రికెటర్ల బ్రాండ్ శక్తిని ఎంతగా పెంచుతున్నాయో ఈ గణాంకాలు చెబుతున్నాయి.
క్రికెట్కు మించి.. బ్రాండ్గా భారత స్టార్లు!
ఈ జాబితాలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. టాప్లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు భారత క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన దిగ్గజాలే. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ తమ ఆటతో సంపాదించుకున్న అభిమానాన్ని బ్రాండ్ ప్రపంచంలోనూ కొనసాగిస్తున్నారు.
మరోవైపు బుమ్రా, రోహిత్ శర్మ ప్రస్తుత తరం క్రికెటర్లకు ఉన్న వాణిజ్య ప్రాధాన్యాన్ని చాటుతున్నారు. మొత్తంగా చూస్తే భారత క్రికెటర్ల ప్రభావం స్టేడియం గోడలు దాటి మార్కెట్లోనూ ఎంత బలంగా ఉందో ఫోర్బ్స్ ఇండియా 2026 జాబితా స్పష్టం చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




