AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

Phani CH
|

Updated on: Sep 18, 2026 | 10:23 PM

Share

అస్సాంలోని మనస్‌ నేషనల్‌ పార్క్‌ ప్రాంతం నుంచి ఐదేళ్ల ఏనుగు దుర్గ సుమారు 3,000 కిలోమీటర్లు ప్రయాణించి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. వినాయక చవితి సందర్భంగా ఆలయ సిబ్బంది, భక్తులు పూలతో దుర్గకు ఘన స్వాగతం పలికారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం మేరకు అస్సాం నుంచి ఐదు ఏనుగులను ప్రముఖ ఆలయాలకు తరలించే ప్రక్రియలో భాగంగా దుర్గ తొలి విడతలో వచ్చింది. అయితే ఈ తరలింపుపై జంతు సంక్షేమ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం… సరికొత్త ప్రదేశం… కొత్త పరిచయాలు… అస్సాం దట్టమైన అడవుల నుంచి బయలుదేరిన ఐదేళ్ల బుల్లి ఏనుగు ‘దుర్గ’ ఇప్పుడు ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో అడుగుపెట్టింది. అస్సాంలోని మనస్ నేషనల్ పార్క్ ప్రాంతం నుంచి ఏకంగా 3,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమిళనాడుకు చేరుకుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ చిన్న గజరాజుకు ఆలయ సిబ్బంది, భక్తులు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం మేరకు, HR & CE (హెచ్‌ఆర్ అండ్ సీఈ) శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాల కోసం అస్సాం నుంచి మొత్తం ఐదు ఏనుగులను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతగా వచ్చిన బుల్లి ఏనుగే ఈ దుర్గ. గతంలో ఆలయాలు ఏనుగులను కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని మద్రాసు హైకోర్టు ఎత్తివేయడంతో, అన్ని చట్టపరమైన అనుమతులతో ఈ బదలాయింపు సాధ్యమైంది. ఇప్పటికే మీనాక్షి ఆలయంలో ‘పార్వతి’ అనే మరో ఆడ ఏనుగు ఉండగా, ఇప్పుడు దుర్గ రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి మరింత పెరగనుంది. అయితే, ఈ సుదీర్ఘ ప్రయాణంపై పర్యావరణవేత్తలు, జంతు సంక్షేమ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం ఐదేళ్ల ప్రాయంలో ఉన్న ఏనుగును తల్లి నుంచి వేరు చేసి వేల కిలోమీటర్లు తరలించడం సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత లేదని, చిన్న వయసులోనే వాటిని బంధించడం సరికాదని వాదిస్తున్నారు. దుర్గ తరలింపు పూర్తయినప్పటికీ, మిగతా నాలుగు ఏనుగుల బదలాయింపు వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య దుర్గ రాక ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు నిజమేంటి?

జలపాతం వద్ద షాకింగ్ సీన్..

గడువు దాటితే.. లైసెన్స్‌ రద్దే!

ఒక్క కాగితం.. స్మృతి మంధాన జీవితాన్నే మార్చేసింది

Follow Us