AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Afg: భారత్-అఫ్గన్ మ్యాచ్‎ను టార్గెట్ చేసిన బ్లాక్ మాఫియా.. 19 మంది అరెస్ట్

Ind Vs Afg: భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ సమయంలో ఢిల్లీ పోలీసులు టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అరుణ్ జైట్లీ స్టేడియం పరిసరాల్లో నిఘా పెట్టి 19 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 71 మ్యాచ్ టికెట్లు, రూ.7,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగించారు.

Ind Vs Afg: భారత్-అఫ్గన్ మ్యాచ్‎ను టార్గెట్ చేసిన బ్లాక్ మాఫియా.. 19 మంది అరెస్ట్
Ind Vs Afg
Rakesh
|

Updated on: Sep 18, 2026 | 3:15 PM

Share

Ind Vs Afg: భారత్ అలాగే అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ సిరీస్ విజయవంతంగా ముగిసినప్పటికీ, మరోవైపు ఢిల్లీ పోలీసులకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. క్రికెట్ మ్యాచ్‌లంటే చాలు టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతుంటారు. అధికారిక వెబ్‌సైట్లలో టికెట్లు క్షణాల్లో అయిపోతుండటంతో ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెటింగ్‌కు తెరలేపారు. ఈ అక్రమ దందాను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. అరుణ్ జైట్లీ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎంతో వ్యూహాత్మకంగా ఈ దందాను అడ్డుకున్నారు.

పోలీసులు సాధారణ ప్రజల మాదిరిగా డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నకిలీ వినియోగదారులుగా వెళ్లి టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ బాగోటాన్ని బయటపెట్టారు. ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్ అలాగే ఎంజీ మార్గ్ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాశారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులను అదునుగా తీసుకుని భారీ ధరలకు టికెట్లు విక్రయిస్తున్న మోసగాళ్ల గుట్టు రట్టు చేశారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 71 మ్యాచ్ టికెట్లతో పాటు రూ.7400ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 13, 15 అలాగే 17 తేదీలలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్‌లు జరిగాయి. మ్యాచ్ తేదీలతో సంబంధం లేకుండా పోలీసులు మొదటి రోజు నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మొదటి మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 29 టికెట్లు లభించాయి. రెండో మ్యాచ్ రోజు మరో 10 మందిని అరెస్ట్ చేసి 31 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. చివరి మ్యాచ్ రోజు కూడా నిఘా కొనసాగించి 4 గురు నిందితులను అరెస్ట్ చేశారు.

అధికారిక ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ అమాయక ప్రేక్షకులను మోసం చేస్తున్న ఈ ముఠాల ఆటకట్టించారు. స్టేడియం వెలుపల అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం ద్వారా భారీ మోసానికి తెరపడింది. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకులు అలాగే సాధారణ ప్రజలను మోసగించే వారిపై చట్టంలోని కఠిన నిబంధనలను ప్రయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక మైదానంలో ఆట విషయానికి వస్తే రోహిత్ సేన ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వాప్ చేసింది. ప్రతి మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు అలాగే బౌలర్లు సమిష్టిగా రాణించి అదరగొట్టారు. చివరి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మైదానంలో జట్టు సాధించిన విజయాలు ఒకవైపు అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటే, మరోవైపు స్టేడియం వెలుపల జరిగిన అక్రమాలపై పోలీసులు తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us