7 ఫోర్లు, 4 సిక్సర్లతో కోహ్లీ ఫ్రెండ్ బీభత్సం.. మరో తుఫాన్ ఇన్నింగ్స్తో ఐపీఎల్ జట్లకు హెచ్చరిక.!
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కావడానికి మరో రెండు నెలలు సమయం ఉంది. ఈ లీగ్ ఆడనున్న చాలామంది స్టార్ బ్యాటర్లు ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్ ఆడుతున్నారు...
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కావడానికి మరో రెండు నెలలు సమయం ఉంది. ఈ లీగ్ ఆడనున్న చాలామంది స్టార్ బ్యాటర్లు ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 టోర్నమెంట్ ఆడుతున్నారు. వీరిలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒకరు. టోర్నీలో వరుసగా తుఫాన్ ఇన్నింగ్స్లతో రచ్చలేపుతున్నాడు.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా వ్యవహరిస్తున్న డుప్లెసిస్ దక్షిణాఫ్రికా లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ మిగతా ఐపీఎల్ జట్లకు హెచ్చరికలు ఇచ్చాడు. ఫిబ్రవరి 5న ఆదివారం సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. తృటిలో రెండో సెంచరీ మిస్సయ్యాడు. ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 61 బంతులు ఎదుర్కుని 92 పరుగులు చేశాడు. అలాగే ఇంతకముందు మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై 113 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు డుప్లెసిస్. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో నమోదైన ఏకైక సెంచరీ ఇదే కావడం విశేషం.
అయితే, సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ మినహా మిగతా బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. డుప్లెసిస్ తన ఓపెనింగ్ పార్టనర్ హెండ్రిక్స్ (40)తో కలిసి 119 పరుగుల మొదటి వికెట్కు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లకు 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే లక్ష్యఛేదనలో సన్రైజర్స్ విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. దీంతో జోబర్గ్ కింగ్స్ 24 పరుగులతో గెలుపొందింది.