515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?

ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయింది. ఎంతోమంది క్రికెటర్లు...

515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?
Cricket
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2021 | 5:14 PM

ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయింది. ఎంతోమంది క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇక డబుల్ సెంచరీ కొంచెం కష్టమే అయినా.. దాన్ని కూడా బాదేస్తున్నారు. అయితే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించడం కష్టమే. ఇది నిజం. 400 అయితే.. మరీ కష్టం.. ఆపై 500 పరుగులంటే కలలు కనాల్సిందే.

అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ 500 పరుగులు చేశాడు. అతడెవరో కాదు వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా లారానే 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. అయితే, బ్రియాన్ లారా కంటే ముందే పలువురు బ్యాట్స్‌మెన్లు టెస్ట్ క్రికెట్‌లో 500 మార్క్‌ను దాటారు. అందులో కొందరు టీమిండియా ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు దాదాభోయ్ రుస్తమ్‌జీ హవేవాలా.

టీమిండియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ దాదాభాయ్ హవేవాలా 27 నవంబర్ 1908న గుజరాత్‌లోని నార్గోల్‌లో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. హవేవాలా తన క్రికెట్‌ను ముంబై(అప్పటి బొంబాయి)లో షురూ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ 1934లో ప్రారంభం కాగా.. అంతకంటే ముందే దాదాభాయ్ తానేంటో నిరూపించుకున్నారు. తన ఆల్‌రౌండ్ ఎబిలిటీస్‌తో చరిత్ర తిరగరాశారు.

1933వ సంవత్సరం డిసెంబర్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా షీల్డ్ ఫైనల్ మ్యాచ్ బొంబాయిలోని ఇస్లాం జింఖానాలో జరిగింది. ఈ మ్యాచ్‌లో రైల్వేస్, సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ బాంబే జట్లు తలపడ్డాయి. రైల్వేస్ తరపున దాదాభాయ్ బరిలోకి దిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన జేవియర్స్ జట్టు మొదటి రోజు ముగిసేసరికి 446 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ వై.ఇస్మాయిల్ అత్యధికంగా 106 పరుగులు చేశాడు.

500 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్..

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ జట్టు వరుసగా మూడు రోజుల పాటు బ్యాటింగ్ చేసింది. దీనితో జేవియర్స్ జట్టు ఎదుట 721 పరుగుల భారీ స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ స్కోర్‌లో 515 పరుగులు దాదాభాయ్ చేసినవే. 56 ఫోర్లు, 32 సిక్సర్లతో దాదాభాయ్ 500 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 2013లో పృథ్వీ షా 546 పరుగులు చేసి 80 ఏళ్ల దాదాభాయ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇక జేవియర్స్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే ఆలౌట్ కాగా.. రైల్వేస్ 147 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక్కడ ఓ ప్రత్యేకత ఏంటంటే.. దాదాభాయ్ కేవలం 515 పరుగులు మాత్రమే చేయలేదు. బంతితోనూ తన ప్రతాపం చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు.. రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

దాదాభాయ్ ఫస్ట్ క్లాస్ కెరీర్ ఇలా ఉంది..

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో దాదాభాయ్ అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. 1934-41 మధ్య ముంబై క్రికెట్ జట్టు తరపున 31 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన దాదాభాయ్.. 50 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 12 అర్ధ సెంచరీల సహాయంతో 1293 పరుగులు చేశాడు. అదే సమయంలో, బౌలింగ్‌లో 51 వికెట్లు పడగొట్టాడు. దాదాభాయ్ తన 73వ ఏట 21 జూలై 1982న తుది శ్వాస విడిచారు.