AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఔటా.. నాటౌటా..? అభిషేక్ శర్మ క్యాచ్‌పై పెను వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్ల ఫైర్!

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక వివాదాస్పద నిర్ణయం కలకలం రేపింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంపై క్రీడాకారులు, అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా అంపైర్ ఫీల్డర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఔటా.. నాటౌటా..? అభిషేక్ శర్మ క్యాచ్‌పై పెను వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్ల ఫైర్!
Abhishek Sharma Controversial Dismissal
Venkata Chari
|

Updated on: Apr 02, 2026 | 9:34 PM

Share

సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్లెస్సింగ్ ముజారబానీ వేసిన షార్ట్ పిచ్ బంతిని అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడాడు. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా వెళ్తున్న ఆ బంతిని వరుణ్ చక్రవర్తి ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతి నేలకు తగిలినట్లు అనుమానం రావడంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలో బంతి నేలను తాకి పైకి లేచినట్లు కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ అని భావించి అవుట్‌గా ప్రకటించాడు.

బ్యాటర్‌కు దక్కని వెసులుబాటు..

సాధారణంగా క్రికెట్ నిబంధనల ప్రకారం, ఏదైనా నిర్ణయం విషయంలో సందేహం ఉంటే దాని ప్రయోజనం బ్యాటర్‌కే దక్కాలి. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా జరిగింది. బంతి నేలను తాకినట్లు వీడియోలో స్పష్టత లేకపోయినా, ఫీల్డర్ వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేసి అర్ధశతకానికి చేరువైన అభిషేక్, తీవ్ర అసంతృప్తితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వరుణ్ చక్రవర్తి అంతకుముందు ఓవర్‌లో 25 పరుగులు సమర్పించుకున్నప్పటికీ, ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

హైదరాబాద్‌కు మెరుపు ఆరంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 34 బంతుల్లోనే 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్‌లోనే పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసి సన్ రైజర్స్ రికార్డు సృష్టించింది. ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ముజారబానీ ఒకే ఓవర్‌లో కిషన్, అభిషేక్ ఇద్దరినీ అవుట్ చేసి కోల్‌కతాను రేసులోకి తెచ్చాడు.

అభిషేక్ శర్మ అవుట్ కాకపోయి ఉంటే సన్‌రైజర్స్ స్కోరు మరింత భారీగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు రావడం ఆటపై ప్రభావం చూపుతాయని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us