మహిళలు హనుమంతుడి పాదాలను తాకితే ఏమవుతుంది..? అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..
శక్తికి, భక్తికి ప్రతిరూపమైన ఆంజనేయ స్వామిని పూజించని వారుండరు. రామనామ స్మరణతో మైమరిచిపోయే ఆ హనుమంతుడిని మనమందరం ఎంతో భక్తితో పూజిస్తాం. కానీ మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదన్న నియమం వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా? ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా పౌరాణిక రహస్యం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కలియుగ ప్రత్యక్ష దైవంగా, భక్తికి, శక్తికి మారుపేరుగా హనుమంతుడిని కోట్లాది మంది భక్తులు పూజిస్తారు. అయితే హనుమంతుడిని ఆరాధనలో మహిళలకు సంబంధించి కొన్ని నియమాలు సమాజంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదు అనే సంప్రదాయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటి..? ఇది కేవలం ఒక మూఢనమ్మకమా లేక దీని వెనుక ఏదైనా పౌరాణిక నేపథ్యం ఉందా..? అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. అయితే హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. బ్రహ్మచర్యం అంటే కేవలం వివాహం చేసుకోకపోవడం మాత్రమే కాదు మనసు, ఆలోచనలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. హనుమంతుని కఠినమైన బ్రహ్మచర్యాన్ని, ఆయన తపస్సును గౌరవిస్తూ, మహిళలు ఆయనను దూరం నుంచే దర్శించుకోవాలని, పాదాలను తాకకూడదని ఒక నియమం ఏర్పడింది. ఇది మహిళలను తక్కువ చేయడమో లేదా నిరోధించడమో కాదు స్వామివారి ఆదర్శాలను గౌరవించడం మాత్రమేనని పండితులు చెబుతున్నారు.
పౌరాణిక నేపథ్యం
ఒక పౌరాణిక గాథ ప్రకారం.. ఒకసారి ఒక మహిళ హనుమంతుని పాదాలను తాకబోగా స్వామివారు అత్యంత మర్యాదగా ఆమెను వారించారట. తన జీవితం పూర్తిగా రామభక్తికి, బ్రహ్మచర్యానికి అంకితమైందని, తనను మానసికంగా పూజించడం ద్వారానే ఆమెకు పుణ్యం లభిస్తుందని వివరించారట. నాటి నుంచి హనుమంతుడిని బాల బ్రహ్మచారి రూపంలో పూజించేటప్పుడు ఈ నియమాన్ని పాటిస్తున్నారు.
భక్తికి లింగభేదం లేదు
గంధపు పొడి పూయడం లేదా పాదాలను తాకడం వంటి కొన్ని శారీరక ఆచారాల విషయంలో పరిమితులు ఉన్నప్పటికీ హనుమంతుని భక్తిలో మహిళలకు ఎటువంటి అడ్డంకులు లేవు. హనుమాన్ చాలీసా పఠించడం, మంగళ, శనివారాల్లో ఉపవాసం ఉండటం, స్వామివారిని ధ్యానించడం వంటి విషయాల్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. సీతాదేవిని తల్లిగా భావించిన హనుమంతుడు, స్త్రీ మూర్తుల పట్ల అత్యంత గౌరవంతో ఉండేవారని రామాయణం చెబుతోంది. అనసూయ, సీతమ్మ వంటి వారు హనుమంతుని పట్ల చూపిన వాత్సల్యం దీనికి నిదర్శనం.
నేటి కాలంలో ఈ ఆచారాలను ఒక పరిమితిగా కాకుండా సాంస్కృతిక గౌరవంగా చూడటం అవసరం. భక్తి అనేది ఆత్మకు సంబంధించింది. ఒక మహిళ హనుమంతుని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం పొందితే, ఆ భక్తిని ఎవరూ కాదనలేరు. మూఢనమ్మకాలకు తావులేకుండా, స్వామివారి సిద్ధాంతాలను గౌరవిస్తూ పూజించడం ముఖ్యం.
