AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిజాత పుష్పాలతో పూజ ఎందుకు ప్రత్యేకం? కిందపడిన పువ్వులనే ఎందుకు సమర్పించాలి?

Parijata Flower Significance: పారిజాత పుష్పాలను చెట్టు నుంచి కోయకుండా కిందపడిన పూలతోనే పూజ చేయాలని ఎందుకు చెబుతారు? సముద్ర మథనం నుంచి శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చిన పారిజాత వృక్షం మహిమ, ఆధ్యాత్మిక విశిష్టత, పురాణాల్లోని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.

పారిజాత పుష్పాలతో పూజ ఎందుకు ప్రత్యేకం? కిందపడిన పువ్వులనే ఎందుకు సమర్పించాలి?
Parijata Flower Significance
Rajashekher G
|

Updated on: Jun 19, 2026 | 2:34 PM

Share

సాధారణంగా పూజలో భూమిపై పడిన పూలను ఉపయోగించకూడదని శాస్త్రాలు సూచిస్తాయి. అయితే పారిజాత పుష్పాల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన నియమం ఉంది. పారిజాత పువ్వులను చెట్టు నుంచి కోయకుండా, సహజంగా నేలపై రాలిన పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన దివ్య వృక్షాలలో ఒకటి. అనంతరం శ్రీమహావిష్ణువు దానిని స్వర్గలోకానికి తీసుకెళ్లగా, సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకొచ్చాడని కథనం ఉంది. అందువల్ల పారిజాతాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు.

కిందపడిన పుష్పాలతోనే పూజ చేయాలని ఎందుకు చెబుతారు?

సాధారణ పూలను తాజాగా కోసి పూజకు ఉపయోగిస్తారు. కానీ పారిజాత పుష్పం మాత్రం భూమిని తాకిన తర్వాతే పూజకు యోగ్యమవుతుందని శాస్త్ర సంప్రదాయం చెబుతోంది. దీనికి కారణం, ఈ వృక్షం స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన దివ్య వృక్షంగా భావించబడటమే. భూమిని స్పృశించిన తర్వాతే ఈ పుష్పం తన సంపూర్ణ పవిత్రతను పొందుతుందని విశ్వాసం.

అందుకే పారిజాత పూలను చెట్టు నుంచి కోయకుండా, తెల్లవారుజామున సహజంగా రాలిన పుష్పాలను సేకరించి భగవంతునికి సమర్పిస్తారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం, ఆవుపేడతో అలికిన పవిత్రమైన నేలపై రాలిన పూలను ఏరుకుని పూజలో ఉపయోగించడం మరింత శుభప్రదంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

పారిజాత వృక్షం ఇంట్లో ఉంటే కలిగే ఫలితాలు

పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ఆవరణలో పారిజాత వృక్షం ఉండటం ఎంతో మంగళకరం. అలాంటి ఇంటిలో సిరిసంపదలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం స్థిరంగా ఉంటాయని చెబుతారు. అలాగే ఆ ఇంటిపై దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.

అందుకే పారిజాత పుష్పాలను కేవలం సువాసనగల పూలుగా కాకుండా, దైవ కృపను ప్రసాదించే పవిత్ర పుష్పాలుగా హిందూ సంప్రదాయంలో ప్రత్యేక గౌరవంతో పరిగణిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us