AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!

Monday Shiva Puja: సోమవారం శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. బ్రహ్మ ముహూర్తంలో శివుడిని పూజించడం వల్ల కోరికలు నెరవేరి, కష్టాలు తొలగి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయి. తలస్నానం చేసి, తెలుపు లేదా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, బిల్వ పత్రాలు, ఇష్టమైన పువ్వులతో శివుడిని ఆరాధించడం శ్రేష్ఠం. ఈ పూజ వల్ల దోషాలు తొలగి, కైలాస ప్రాప్తి లభిస్తుంది.

సోమవారం శివుడిని పూజిస్తే ఏమవుతుందో తెలుసా? శాస్త్రాలు చెప్పిన అద్భుత ఫలితాలు!
Shiva Puja
Rajashekher G
|

Updated on: Jun 08, 2026 | 12:05 AM

Share

సోమవారం, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయని అనాదిగా ఒక బలమైన విశ్వాసం ఉంది. శివపురాణం ప్రకారం, నిష్కపటమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే, దారిద్ర్యం తొలగి, సుఖసంతోషాలు, సిరిసంపదలు లభిస్తాయి. ఇప్పుడు సోమవారం శివపూజను ఎలా నిర్వహించాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.

పూజ విధివిధానాలు:

సోమవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో (ఉదయం 3 నుండి 6 గంటల మధ్య) నిద్రలేవడం ఉత్తమం. ఈ సమయం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. నిద్రలేచిన తర్వాత తలస్నానం చేసి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. పూజకు తెలుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శివుడికి ఇష్టం అని చెబుతారు. ఇంటిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పూజకు సిద్ధం కావాలి. స్త్రీలు పాపిటిపై కుంకుమ, నుదుటిన విభూతి ధరించడం శుభకరం. విభూతి అందుబాటులో లేనివారు గంధాన్ని ధరించవచ్చు. విభూతి ధరించడం వల్ల జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

శివపార్వతుల చిత్రపటానికి ముందుగా గంధపు బొట్టు పెట్టి, పూలతో అలంకరించాలి. శివుడికి ఇష్టమైన పూలైన గన్నేరు, జిల్లేడు, శంఖు పుష్పాలలో ఏదో ఒకటి సమర్పించినా శుభమే. పూలు సమర్పించిన తర్వాత దీపారాధన చేయాలి. దీపం వెలిగించడానికి నువ్వుల నూనెలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి వాడటం శ్రేష్ఠం. ఆవు నెయ్యి లక్ష్మీప్రదం అని నమ్ముతారు. దీనివల్ల సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. నైవేద్యంగా అరటి పండు లేదా బెల్లం ముక్క సమర్పించవచ్చు.

ఇవి కూడా చదవండి

దీపం వెలిగించిన తర్వాత శివుడికి నమస్కరించి, మూడు అగరవత్తులను వెలిగించి ధూపం వేయాలి. అనంతరం పూజ గదిలో కూర్చుని 11 సార్లు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి. చివరగా హారతి ఇచ్చి, మీ మనసులోని కోరికలను శివుడికి విన్నవించి, గంట మోగించాలి. గంట మోగిస్తేనే పూజ పూర్తయినట్టు అర్థం. పూజానంతరం మనసులో శివపార్వతులను తలుచుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేయాలి.

శివాభిషేకం ప్రాముఖ్యత:

పండితులు చెప్పిన దాని ప్రకారం, ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చేయనిదే పూజ పూర్తి కాదని అంటారు. శివుడు సంతోషించాలంటే, శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా కరుణిస్తాడు. సోమవారం పూజలో బియ్యప్పిండితో శివలింగ రూపాన్ని తయారుచేసి, దానిని శివునిగా భావించి నీటితో అభిషేకం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది.

సోమవారం ఉపవాసం, ఇతర ప్రయోజనాలు:

సోమవారం ఉపవాసం ఉండటం వల్ల కైలాస ప్రాప్తి లభిస్తుందని శివపురాణం చెబుతుంది. రోజంతా ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం సమయంలో పండ్లు, మంచినీరు తీసుకోవచ్చు. పెళ్లికాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే, కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం.

ఏ పూలతో ఎలాంటి ఫలితం?

శివ ధ్యానం, పూజ ద్వారా శని దోషం, కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి. ఓం నమశ్శివాయ అని తలచుకున్నా శుభం కలుగుతుంది. శంకు పుష్పాలు, తామర పూలతో పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో సంపద పెరుగుతుంది. మల్లె పూలతో పూజిస్తే కోరుకున్న వివాహం జరుగుతుంది. బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. పాలతో అభిషేకం చేయడం వల్ల కూడా కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

పెద్దగా పూజలు చేయలేని వారు కూడా కల్మషం లేని మనసుతో శివుడిని ధ్యానిస్తే చాలు, శివుడు కరుణిస్తాడు. దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us